Pak PM in SC: మిస్టర్‌ పీఎం.. హంతకులతో చర్చలా?ఇమ్రాన్‌ను నిలదీసిన న్యాయస్థానం..

పాకిస్థాన్‌లోని పెషావర్‌ మారణహోమం కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అక్కడి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

Published : 11 Nov 2021 01:29 IST

పెషావర్‌ మారణహోమం కేసులో కోర్టుకు హాజరైన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ సైనిక పాఠశాలలో 2014లో మారణహోమం జరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ తాలిబన్లుగా పిలువబడే తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్‌ (TTP) ముష్కరులు జరిపినట్లు భావిస్తోన్న ఈ దాడితో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అక్కడి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు 150మంది చిన్నారుల నరమేధానికి పాల్పడిన వారితో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రధానమంత్రిని నిలదీసింది.

పాకిస్థాన్‌ పెషావర్‌లో 2014లో ఆరుగురు ముష్కరులు చేసిన మారణహోమంలో 147మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 132 మంది చిన్నారులే. ఈ దారుణం చోటుచేసుకొని ఏడేళ్లు కావస్తోన్నా దీనికి కారణమైన వారిని మాత్రం పాక్‌ ప్రభుత్వం ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఇందులో భాగంగా గతనెల ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా ప్రధానమంత్రి నేరుగా న్యాయస్థానానికి హాజరై సమాధానమివ్వాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆదేశాలు అందిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. అనంతరం పెషావర్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (APS) ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని త్రిసభ్య ధర్మాసనం ప్రధానమంత్రిని అడిగింది. ఈ సందర్భంగా ఆయనపై త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

పరిహారం కాదు.. బాధితుల ప్రశ్నకు బదులేది..?

ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందించామని.. అప్పటి మారణకాండ తర్వాత నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ను కూడా తీసుకువచ్చామని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ కోర్టుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌.. బాధిత తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కోరుకుంటోంది పరిహారం కాదన్నారు. (ఆరోజు) భద్రతా వ్యవస్థ ఎక్కడ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు..? వీటిపై నెలక్రితం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కనీస చర్యలు కూడా తీసుకోలేదని చీఫ్‌ జస్టిస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మారణహోమంలో భాగస్వామ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు.. అక్టోబర్‌ 20న కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని చీఫ్‌ జస్టిస్‌ తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రధానమంత్రికి చురకలు..

అంతకుముందు బాధిత చిన్నారుల తల్లిదండ్రులను కలిశానని.. భవిష్యత్తులోనూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తానని ఇమ్రాన్‌ ఖాన్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇంతటితో ఆగకుండా ‘80వేల మంది ప్రజలు ఎలా మరణించారో తెలుసుకోండి. పాకిస్థాన్‌లో 480 డ్రోన్‌ దాడులకు బాధ్యులెవరో తెలుసుకోండి’ అని ధర్మాసనం ముందు వ్యాఖ్యానించారు. దీనికి బదులిచ్చిన చీఫ్‌ జస్టిస్‌.. ‘ఈ విషయాలు తెలుసుకోవాల్సింది మీరు. మీరు ప్రధానమంత్రి. ఇలాంటి ప్రశ్నలకు ఓ ప్రధానమంత్రిగా మీ దగ్గర సమాధానం ఉండాలి’ అంటూ ఇమ్రాన్‌ ఖాన్‌కు చురకలు అంటించారు.

దోషులతో చర్చలు జరపడమేంటి..?

‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. మనది చిన్న దేశం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశాల్లో ఆరో స్థానంలో ఉన్నాం. అయినప్పటికీ హత్యాకాండకు పాల్పడిన వారితో సంప్రదింపులు జరపడమేంటి? అలాంటి వారితో మీరు చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి’ అని త్రిసభ్య ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ క్వాజి మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఈ విషాదంపై ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దీనిపై కమిషన్‌ వేశామని.. ఆ కమిషన్‌ నివేదిక కూడా అందజేసిందని సుప్రీం కోర్టు ఇమ్రాన్‌కు గుర్తుచేసింది. ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రభుత్వం కనిపెట్టి వారిపై చర్యలు చేపట్టాలని అక్టోబర్‌ 20నే ఆదేశాలు ఇచ్చామని.. ఆ దారుణ ఘటన జరిగి ఇప్పటికే ఏడేళ్లు గడుస్తున్నా పురోగతి శూన్యమని ఆవేదన వ్యక్తం చేసింది. తెహ్రీన్‌-ఏ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (TTP) నిషేధిత సంస్థతో సంపూర్ణ కాల్పుల విమరణ ఇప్పందం పూర్తైనట్లు పాక్‌ సమాచార శాఖమంత్రి ఫవాద్‌ ఛౌదురి ప్రకటించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.

సుప్రీం ఆగ్రహం.. కోర్టుకొచ్చిన ప్రధాని..

ఇదిలాఉంటే, అంతకుముందు.. పెషావర్‌ దాడి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గతనెల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వీటి పురోగతిపై నేడు (నవంబర్‌ 10) మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టును ఆదేశించింది. వీటికి ఏజీ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అసలు కోర్టు ఆదేశాలను ప్రధానమంత్రి చదివారా? లేదా అని అటార్నీ జనరల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో కోర్టు ఆర్డర్‌ కాపీని ప్రధానమంత్రికి పంపించలేదని.. త్వరలోనే తెలియజేస్తానని అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావెద్‌ ఖాన్‌ కోర్టుకు విన్నవించారు. దీంతో ఆగ్రహించిన సుప్రీం ధర్మాసనం.. కేసుపై మీకున్న శ్రద్ధ ఇదేనా..? అంటూ చీఫ్‌ జస్టిస్‌ మండిపడ్డారు. ప్రధానమంత్రిని పిలవండి.. మేమే ఆయనతో మాట్లాడుతాం.. ఇది ఇలాగే కొనసాగకూడదని ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్‌ జస్టిస్‌.. వెంటనే ఇక్కడకు రావాలంటూ ప్రధానమంత్రికి సమన్లు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. అవి అందిన కొన్ని గంటల్లోనే సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలోనే సుప్రీం ధర్మాసనం ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.

ఇక పెషావర్‌ దారుణ ఘటనలో అలసత్వానికి కారణమైన మిలటరీ అధికారులపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నిఘా వ్యవస్థల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ.. ఫలితం శూన్యమని  ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి గుల్జార్‌ అహ్మద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు