రైతులతో కిక్కిరిసిన ముజఫర్‌నగర్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ పట్టణం రైతులతో కిక్కిరిసింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన మహాపంచాయత్‌ కార్యక్రమానికి వేలాది మంది రైతులు.......

Published : 29 Jan 2021 20:40 IST

మహా పంచాయత్‌ కార్యక్రమానికి వేల మంది రైతులు

ముజఫర్‌నగర్ ‌(యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ పట్టణ రైతులతో కిక్కిరిసింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన మహా పంచాయత్‌ కార్యక్రమానికి వేల మంది రైతులు హాజరయ్యారు. దిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపూర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతులను బలవంతంగా తరలించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం రాత్రి నాటి పరిణామాలపై బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్‌ ఆందోళనకు దిగుతూ.. రైతు ఉద్యమాన్ని అణచివేతకు కుట్ర జరుగుతోందంటూ కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేశ్‌ టికాయత్‌ మహాపంచాయత్‌ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో దీనికి పెద్దఎత్తున స్పందన లభించింది.

దిల్లీకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫర్‌నగర్‌లోని మహవీర్‌ చౌక్‌ సమీపంలో ఉన్న జీఐసీ మైదానం పూర్తిగా స్థానిక రైతులతో నిండిపోయింది. ఘాజీపూర్‌ వద్ద నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు వేల మంది తరలివచ్చారు. జాతీయ జెండాలు, రైతు జెండాలు ఉంచిన వందలాది ట్రాక్టర్లతో పట్టణ రోడ్లు నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇదే కార్యక్రమంలో రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత అజిత్‌ సింగ్‌, ఆయన తనయుడు జయంత్‌ చౌధురి పాల్గొన్నారు. బీకేయూకు తమ మద్దతు ప్రకటించారు.

ఇవీ చదవండి..
జర్నలిస్టులపై దేశద్రోహం..ఖండించిన ఎడిటర్స్‌ గిల్డ్‌!
సింఘులో మళ్లీ ఉద్రిక్తత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని