శ్రీదేవి నాది.. ఎప్పటికీ నాదే

సుధీర్‌బాబు కథానాయకుడిగా ‘పలాస’ ఫేం కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు...

Updated : 20 Aug 2021 07:18 IST

సుధీర్‌బాబు కథానాయకుడిగా ‘పలాస’ ఫేం కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఆనంది కథానాయిక. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హీరో మహేష్‌బాబు చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని బట్టి.. 80ల కాలం నాటి అమలాపురం నేపథ్యంలో సాగే ప్రేమ కథాంశంతో సినిమా రూపొందినట్లు అర్థమవుతోంది. కులాలు.. పరువు ప్రతిష్ఠల అంశాల్ని ఇందులో టచ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో లైటింగ్‌ సూరిబాబుగా సుధీర్‌ కనిపిస్తుండగా.. సోడాల శ్రీదేవిగా ఆనంది కనిపించింది. ఓ మర్డర్‌ కేసులో జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిగా సుధీర్‌ పాత్రని పరిచయం చేస్తూ ట్రైలర్‌ ప్రారంభించారు. అనంతరం సూరిబాబు, శ్రీదేవిల ప్రేమకథను చూపించారు. మరి వీళ్ల ప్రేమకథకు ఇంట్లో వాళ్ల నుంచి.. సమాజం నుంచి ఎదురైన సవాళ్లేంటి? చివరికి ఈ జంట ఒక్కటైందా? లేదా? అన్నది మిగతా కథాంశం. ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాలను బట్టి.. సినిమాలో యాక్షన్‌.. ఎమోషన్‌ అంశాలకు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ఆఖర్లో ‘‘శ్రీదేవికి పెళ్లి చేసేస్తారురా.. శ్రీదేవి నాది.. ఎప్పటికీ నాదే’’ అంటూ సుధీర్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని