Padmanabham: చిన్నప్పుడు చేసిన పనికి..!

తనదైన హాస్యంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం (Padmanabham). నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు.

Published : 18 Sep 2023 17:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనదైన హాస్యంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం (Padmanabham). నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్‌ హోదా అనుభవించారో, చివరి రోజుల్లో అంత పేదరికంలో బతికారు. చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయివేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారు పద్మనాభం. పెద్దయ్యాక ఈ సంఘటన ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ‘జాతకరత్న మిడతం భొట్లు’ సినిమాలో మిడతంభొట్లుని రాజు వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఓ అంధుడు “ఇతడు చేసిన నేరం ఏంటి?” అని అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రీకరణకు ఒక నిజమైన అంధుడిని తీసుకొచ్చి షాట్ ఓకే అయ్యాక కొంతడబ్బు ఇచ్చి పంపారు పద్మనాభం. చిన్నప్పుడు చేసిన పాప పరిహారార్ధం లిటిల్ ఫ్లవర్ ‘బ్లైండ్ అండ్ డెఫ్’ సంస్థకు అప్పట్లో అయిదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకురావాలంటే లౌక్యం అవసరం. అదిలేక చిత్తూరు నాగయ్య వంటి గొప్ప నటులు చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో ‘సినిమా వైభవం’ చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద రూ.60 వేలు అప్పుచేశారు. అందుకు హామీగా ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’, ‘శ్రీరామకథ’ సినిమాల నెగటివ్‌లను తాకట్టు పెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు ఆయన పరమవుతాయనేది అగ్రిమెంటు.

గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్రా, నైజాం ఏరియాలకు రూ.2.75లక్షలకు ఆయన అమ్మేశారు. అప్పు తీరగా, మిగతా డబ్బు పద్మనాభానికి ఇవ్వలేదు. పైగా సినిమా నెగెటివ్‌లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ, పద్మనాభానికి న్యాయం జరగలేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. చివరికి ఆ వ్యక్తి మరణించాక వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకొని నెగెటివ్‌లు పద్మనాభానికి ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని