చైనా మొబైల్‌ ప్రచారానికి యంగ్‌ హీరో గుడ్‌బై?

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ చైనాకు చెందిన ఒప్పొ మొబైల్స్‌కు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ బ్రాండ్‌తో ప్రచార ఒప్పందాన్ని కార్తీక్‌ వదులుకున్నాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గల్వాన్‌ ఘటనతో చైనా, భారత్‌

Published : 10 Jul 2020 01:13 IST

ముంబయి: బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ చైనాకు చెందిన ఒప్పో మొబైల్స్‌కు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ బ్రాండ్‌తో ప్రచార ఒప్పందాన్ని కార్తీక్‌ వదులుకున్నాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గల్వాన్‌ ఘటనతో చైనా- భారత్‌ మధ్య ఘర్షణ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. చైనాకు గుణపాఠం చెప్పాలని భావించిన కేంద్ర ప్రభుత్వం... ఆ దేశానికి చెందిన యాప్స్‌ను నిషేధించింది. మరోవైపు చైనా వస్తువులకు ప్రచారం చేయొద్దని కోరుతూ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ సమాఖ్య గత నెలలోనే సినీ ప్రముఖులకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కార్తీక్‌ ఆర్యన్‌ ఒప్పో ప్రచారాన్ని ఆపేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్‌మీడియాలో అతడు పెట్టిన ఓ ఫొటో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల కార్తీక్‌ ఆర్యన్‌ తన ఇంట్లో కిటికీ దగ్గర నిలబడి మేఘాలను తన ఫోన్‌లో ఫొటో తీస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే కార్తీక్ పట్టుకున్న ఫోన్‌ ఐఫోన్‌ కావడంతో నెటిజన్లు, అతడి అభిమానులు చైనా ఫోన్‌ ప్రచారాన్ని కార్తీక్‌ వదిలేశాడని చెబుతున్నారు. నిజానికి వ్యాపార ఒప్పందం ప్రకారం.. ఒకరు ఒక బ్రాండ్‌కి ప్రచారకర్తగా ఉన్నప్పుడు మరో బ్రాండ్‌ను సోషల్‌మీడియాలో ప్రచారం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా కార్తీక్‌ ఐఫోన్ పట్టుకొని దిగిన ఫోటో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం, ఒప్పో కోసం చివరగా జనవరిలో మాత్రమే ప్రచారం చేయడం చూస్తుంటే కార్తీక్‌ చైనా బ్రాండ్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘‘కార్తీక్‌ ఆర్యన్‌ ఒప్పోతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. చైనా, భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. చైనా బ్రాండ్స్‌కు ప్రచారం వదులుకున్న తొలి బాలీవుడ్‌ నటుడు కార్తీక్‌ ఆర్యనే’’అని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. దానిపై మరింత స్పష్టత రావాలంటే కార్తీక్‌ ఆర్యనే స్వయంగా ప్రకటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని