Tollywood: తారలు దిగిన వేళ

చాలా రోజుల తర్వాత సినిమా లొకేషన్లు కళకళలాడాయి. చిత్రసీమలో అసలు సిసలు సందడి కనిపించింది. ఒకే రోజు పలువురు అగ్రతారల సినిమాలు పట్టాలెక్కడమే అందుకు కారణం! రెండో దశ కరోనా వల్ల ఏప్రిల్‌ మాసంలోనే సెట్స్‌పైనున్న పలు సినిమాలు...

Updated : 13 Jul 2021 05:56 IST

చాలా రోజుల తర్వాత సినిమా లొకేషన్లు కళకళలాడాయి. చిత్రసీమలో అసలు సిసలు సందడి కనిపించింది. ఒకే రోజు పలువురు అగ్రతారల సినిమాలు పట్టాలెక్కడమే అందుకు కారణం! రెండో దశ కరోనా వల్ల ఏప్రిల్‌ మాసంలోనే సెట్స్‌పైనున్న పలు సినిమాలు ఆగిపోయాయి. దాదాపు రెండు నెలలుగా చిత్రీకరణలు లేక సినీ పరిశ్రమ కళతప్పింది. ఎట్టకేలకి కరోనా తగ్గుముఖం పట్టడంతో చిత్రీకరణలు ఇటీవల మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నెల ఆరంభం నుంచే పలు చిత్రాలు పట్టాలెక్కాయి. సోమవారం నుంచి బాలకృష్ణ ‘అఖండ’, మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ పునః ప్రారంభం కావడంతోపాటు రామ్‌ పోతినేని, అఖిల్‌ అక్కినేని కొత్త చిత్రాలు కూడా సెట్స్‌పైకి వెళ్లాయి.

‘అఖండ’... ఇదే చివరి షెడ్యూల్‌

విజయవంతమైన బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా ఉధృతి మొదలయ్యాక కూడా చాలా రోజులపాటు చిత్రీకరణ జరుపుకున్న ‘అఖండ’ దాదాపు చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్‌లో పునః ప్రారంభమైన తాజా షెడ్యూల్‌ చివరిదని చిత్రబృందం తెలిపింది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ నటిస్తున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ముఖ్య తారాగణంపై...

హేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలైంది. తొలి షెడ్యూల్‌ దుబాయ్‌లో జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా పునః ప్రారంభమైన షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్‌ సరసన కీర్తిసురేష్‌ నటిస్తోంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.

‘ఏజెంట్‌’.. స్పై థ్రిల్లర్‌!

కొత్త కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఏజెంట్‌’. అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తుండగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. కండలు పెంచిన దేహంతో కనిపిస్తున్న అఖిల్‌ లుక్‌ని కూడా ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం.

రామ్‌ 19 షురూ

యువ కథానాయకుడు రామ్‌ - తమిళ దర్శకుడు  లింగుస్వామి కలయికలో రూపొందుతున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. కృతిశెట్టి కథానాయిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ రెండు రకాల పాత్రల్లో సందడి చేయనున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని