వసూళ్ల మొత్తం రైలు ప్రమాద బాధితుల కోసం

థియేటర్‌ ఖర్చులు పోనూ తెలుగు రాష్ట్రాల నుంచి తన సినిమాకి వచ్చే వసూళ్లన్నీ ఒడిశా రైలు ప్రమాద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు తెలిపారు ప్రశాంత్‌ కార్తీ.

Published : 08 Jun 2023 02:00 IST

థియేటర్‌ ఖర్చులు పోనూ తెలుగు రాష్ట్రాల నుంచి తన సినిమాకి వచ్చే వసూళ్లన్నీ ఒడిశా రైలు ప్రమాద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు తెలిపారు ప్రశాంత్‌ కార్తీ. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘అనంత’. రితిక చక్రవర్తి కథానాయిక. మధుబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రశాంత్‌ కార్తీ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘పరిశోధనాత్మక థ్రిల్లింగ్‌ కథతో రూపొందిన చిత్రమిది. మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగుతుంది. ఇలాంటి కథాంశంతో మన దేశంలో  ఇప్పటివరకు సినిమా రాలేదు. కథలోని కొన్ని అంశాలపై  సెన్సార్‌ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినా, రివిజన్‌ కమిటీ  ధృవీకరణ పత్రం అందజేసింది. సమాజానికి ఉపయోగపడే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించాం. ప్రతీ సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మధుబాబు చాలా బాగా తెరకెక్కించార’’న్నారు.  ఒడిశాలోని బాలాసోర్‌ దగ్గర జరిగిన రైలు  ప్రమాదం ఎంతగానో కలచివేసిందని, ప్రమాద  బాధితులకి సాయంగా నిలిచేందుకే ఈ సినిమాకి థియేటర్ల ద్వారా వచ్చే వసూళ్లన్నీ అందజేయాలని నిర్ణయించినట్టు ప్రశాంత్‌ కార్తీ తెలిపారు. తన నట ప్రయాణం గురించి చెబుతూ  ‘‘ఇదివరకు  ‘ధృవ’, ‘చెక్‌’, ‘కొండా’ సినిమాల్లో నటించా. ‘కొండా’ సినిమాకి నిర్మాణం విభాగంలోనూ పనిచేశా. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ అనుభవం ఈ సినిమాకి పనికొచ్చింద’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని