‘ఉప్పెన’లోకి ఎలా వచ్చిందంటే..!

ఒకరు నటించాల్సిన సినిమాలో మరొకరు నటించడం సర్వ సాధారణం. కొన్నిసార్లు ఓ కథానాయికతో సినిమా మొదలవుతుంది.. పలు కారణాల వల్ల మరో నాయికతో ఆ చిత్రం విడుదలవుతుంది. ‘ఉప్పెన’ సినిమాకు సంబంధించి కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది.

Updated : 07 Dec 2022 20:01 IST

ఒకరు నటించాల్సిన సినిమాలో మరొకరు నటించడం చిత్ర పరిశ్రమలో సర్వ సాధారణం. కొన్నిసార్లు ఓ కథానాయికతో సినిమా మొదలవుతుంది.. పలు కారణాల వల్ల మరో నాయికతో ఆ చిత్రం విడుదలవుతుంది. ‘ఉప్పెన’ సినిమాకు సంబంధించి కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది.

‘ఉప్పెన’ ప్రేక్షకులకి చేరువకావడంలో నాయిక కృతి శెట్టి ప్రధాన కారణమని చెప్పొచ్చు. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువ మనసుల్ని కొల్లగొట్టి ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్‌ ధక్‌ ధక్‌’ అంటూ పాటలతోనే ఫిదా చేసేసింది. అంతే.. ఈ ముద్దుగుమ్మను వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆశగా ఎదురు చూశారు సినీ ప్రియులు. ఇటీవలే సినిమా విడుదలైంది.. బేబమ్మగా కనిపించి ఆకట్టుకుంటోంది కృతి. తొలి పరిచయంలోనే అగ్ర కథానాయిలకు ఉండే ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అన్నింటికీ కారణం ఆ పాత్రలో ఒదిగిపోవడం. అసలు ఈ బేబమ్మ పాత్ర కృతికి ఎలా దక్కిందో తెలుసా?

సముద్రం నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ఈ ప్రేమ కథలో తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు. అనుకున్నట్టుగానే మనీషా అనే తెలుగమ్మాయిని ఎంపిక చేశారు. పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. మరోవైపు అదే సమయంలో దర్శకుడు బుచ్చిబాబు కృతి ఫొటోలు చూశారు. దాంతో సందిగ్ధంలో పడిన ఆయన తన గురువు, దర్శకుడు సుకుమార్‌ని కలిసి విషయం చెప్పారు.

‘‘నీ కన్నా.. నా కన్నా సినిమా గొప్పది. దానికి అన్యాయం చేయకూడదు. దర్శకుడిగా నువ్వు తీసుకునే నిర్ణయమే సరైంది. కొత్త అమ్మాయినే తీసుకో’ అని సలహా ఇచ్చారట. ‘ఈ మాట విన్న వెంటనే కృతి శెట్టిని పిలిపించాను. చూడగానే బాగుంది. బేబమ్మ పాత్రకు సరిపోతుందనిపించింది. నేను అనుకున్న విధంగా చేయగలుతుందా? అనే ఆలోచన మదిలో మెదిలింది. అయినా ధైర్యం చేసి ముందుకెళ్దామని ఫిక్స్‌ అయ్యా. కృతి కూడా కష్టపడి తనెంటో నిరూపించుకుంది’’ అని ఇటీవల ఓ కార్యక్రమంలో తెలియజేశారు బుచ్చిబాబు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని