Siddharth: ఒంటరిగా పోరాడలేకపోతున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: సిద్దార్థ్‌

సోషల్‌మీడియా ముఖ్యంగా ట్విటర్‌కు దూరంగా ఉండటంపై నటుడు సిద్దార్థ్‌ (Siddharth) స్పందించారు. ఒంటరిగా పోరాటం చేయలేకపోతున్నానని ఆయన చెప్పారు.

Published : 06 Jun 2023 01:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విషయం ఏదైనా సరే సోషల్‌మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తారు నటుడు సిద్దార్థ్‌ (Siddharth). అయితే, ఆయన గత కొంతకాలంగా ట్విటర్‌కు దూరంగా ఉంటున్నారు. ఇదే విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒంటరిగా పోరాటం చేయలేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

‘‘యాక్టివిస్ట్‌ అనే పదం నాకు సరదాగా అనిపిస్తుంది. నేను కేవలం వాస్తవం వైపు నిలబడి నా గళాన్ని వినిపిస్తుంటాను. ఒక నటుడిగా ఎంతోకాలం నుంచి పలు విషయాలపై నా వాయిస్‌ వినిపించాను. నా సహ నటీనటులెవరూ నాకు తోడు రావడం లేదు. అలాగే.. ‘సిద్దార్థ్‌ ఒక్కడే మాట్లాడుతున్నారు. మీరెందుకు మీ గొంతు విప్పడం లేదు?’ అని వాళ్లను ఎవరూ ప్రశ్నించడం లేదు. అందుకే నేను కాస్త వెనక్కి తగ్గాను. ఒక్కడినే ఎందుకు మాట్లాడాలనిపించింది. ప్రపంచంలో ఉన్న దుష్టశక్తులపై నేనొక్కడినే పోరాటం చేయలేను. నేనేమీ సూపర్‌హీరోని కాదు. మరోవైపు, నాపై ఎంతోమంది ఫిల్మ్‌మేకర్స్‌ పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి, వారికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని సిద్దార్థ్‌ వెల్లడించారు.

ఇక, గతేడాదిలో సిద్దార్థ్‌, సైనా నెహ్వాల్‌కు మధ్య ట్విటర్‌ వార్‌ జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని భద్రతా వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ అప్పట్లో సైనా ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సిద్దార్థ్‌ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశారు. అది కాస్త పెద్ద దుమారం కాగా, సిద్దార్థ్‌ ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఘటన తర్వాత సిద్దార్థ్‌ ట్విటర్‌లో యాక్టివ్‌గా కనిపించిన సందర్భాలు తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని