Krishna Vamsi: ఇందిరాగాంధీ కుటుంబంలో మరణాలను చూశాక...

అమ్మ.. నాన్న.. అక్క.. తమ్ముడు.. అత్త.. మామ.. అన్నయ్య.. వదిన. ఇలా సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ కలుసుకోవాలంటే

Published : 27 Jul 2021 12:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమ్మ.. నాన్న.. అక్క.. తమ్ముడు.. అత్త.. మామ.. అన్నయ్య.. వదిన. ఇలా సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ కలుసుకోవాలంటే పెద్ద పండుగలకో.. పెళ్లిళ్లకో మాత్రమే కలుస్తాం. కానీ, కృష్ణవంశీ సినిమాకు వెళ్తే మనవాళ్లందరూ మదిలో మెదులుతారు. సినిమాలోని ఒక్క సన్నివేశమైనా మన హృదయాన్ని తాకుతుంది. మన జీవితంలో జరిగిన మధురానుభూతులు మనల్ని తట్టి లేపుతాయి.. క్రియేటివ్‌, ఫీల్‌గుడ్‌ సినిమాలకు కృష్ణవంశీ కేరాఫ్‌ అడ్రస్‌. మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు.

చిన్నతనం నుంచే సినిమాలపై ఇష్టం

‘‘సినిమా అంటే రంగుల ప్రపంచం అనుకునేవాడిని. అందుకే చదువుకునే రోజుల నుంచే సినిమా రంగానికి వెళ్లాలని ఉండేది. పుట్టింది తాడేపల్లిగూడెం అయినా, నాన్న ఇంజినీర్‌ కావడంతో కర్నూలు జిల్లా నందికొట్కూరులో కొంతకాలం ఉన్నాం. అప్పుడు ఏకంగా థియేటర్‌ ప్రొజెక్టర్‌ రూమ్‌కి వెళ్లి సినిమాలు చూసేవాడిని. ఇంటర్మీడియట్‌ తర్వాత సినిమాల్లోకి వెళ్తానని నాన్నతో చెప్పా. అయితే డిగ్రీ పూర్తి చేయ్‌ తర్వాత వెళ్లవచ్చు అన్నారు. ఆయనకు ఐఏఎస్‌ చదివించాలని ఉండేది కానీ, నాకు సినిమాలపై ఇష్టంతో డిగ్రీ పూర్తి చేశాక సినిమాలవైపు వచ్చాను’’ అంటూ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటారు కృష్ణవంశీ.

రాంగోపాల్‌వర్మ వద్ద శిష్యరికం

మద్రాసులో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఆ సమయంలో కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్న శివనాగేశ్వరరావు.. కృష్ణవంశీని రాంగోపాల్‌వర్మకు పరిచయం చేశారట. ఆ పరిచయమే తాను ఎదగడానికి ఉపయోగపడిందని చెబుతుంటారు. తనలోని మార్పులకు కూడా వర్మే కారణం అంటారు. సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నానని చెబుతారు. ముఖ్యంగా ప్రతిభను చూపించడానికి ప్రతిసారీ వర్మ అవకాశం ఇచ్చేవారని అంటారు. ఇలాగే ‘మనీ మనీ’ సినిమా అవకాశం వచ్చిందంటారు. ‘‘ఒక రోజు తాజ్‌కృష్ణా సెలూన్‌లో మాటల మధ్యలో ‘మనీ మనీ’ సినిమా నన్ను డైరెక్ట్‌ చేయమన్నారు. సార్‌ నేను చెయ్యను. డైరెక్షన్‌ చేసే సామర్థ్యం ఇంకా రాలేదు. అయినా ఎవరో తీసిన సినిమాకి సీక్వెల్‌ అస్సలు చేయను అన్నాను. అయితే ఆయన మాత్రం నీ సామర్థ్యం నాకు తెలుసు ఊరికే ఈ సినిమా తీయ్యి అన్నారు. డైరెక్టర్‌గా నాపేరు వెయ్యనంటే చేస్తానన్నా. అలా తొలి సినిమా అనుకోకుండా దర్శకత్వం వహించా’ అని తొలి సినిమా సంగతులు పంచుకుంటారు కృష్ణవంశీ.

ఆ తర్వాత ‘అనగనగా ఒకరోజు’ చిత్రానికి డైరెక్టర్‌గా కొంత షూటింగ్‌ చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల తప్పుకొన్నారు. ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఎలాగైనా సినిమా తీయాలన్న కసి ‘గులాబి’ సినిమాను తీసేలా చేసింది. పైగా ఈ సినిమాలో నటించిన మహేశ్వరి తప్ప అందరూ ఇక్కడి వారే పనిచేయడం మరో విశేషం. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడిగా వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’తో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి తాను నమ్మిన కథలను, సిద్ధాంతాలకు అనుగుణంగా సినిమాలు తీశారు. ఇలా వచ్చినవే ‘సింధూరం’, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం చిత్రాలు.

మహేష్‌బాబుతో తొలిసినిమా తీయాల్సింది!

మహేష్‌బాబును కథానాయకుడిగా పరిచయం చేసే అవకాశం వచ్చినా దాన్ని వదులుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మురారి’ సినిమా తీసే అవకాశం వచ్చింది. తొలుత యూత్‌ సినిమా తీయాలని అనుకున్నా.. మహేష్‌బాబును సరికొత్త కోణంలో ఆవిష్కరించాలని అనుకుని కథ చెప్పి మరీ ఒప్పించారట. ఆ సినిమాలోని పాత్రలకు భారత, భాగవతాలే స్ఫూర్తి అంటారు. మహేష్‌బాబు కృష్ణుడు, సోనాలీ బింద్రే ఫస్ట్‌హాఫ్‌లో సత్యభామ, సెకండాఫ్‌లో రుక్మిణి. శిశుపాలుడు రవిబాబు, యశోద లక్ష్మి. బలరాముడు పాత్ర సత్యనారాయణ. అసలా సినిమా కాన్సెప్ట్‌ కూడా ఇందిరాగాంధీ కుటుంబంలో మరణాలను చూశాక వచ్చిందట. ఫిరోజ్‌గాంధీని ఎవరో కాల్చేశారు. ఇందిరాగాంధీ మరణం కూడా అంతే. సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో, రాజీవ్‌గాంధీ బాంబుపేలుడులో చనిపోవడం ఏదో శాపంలాగా..! అలాంటి శాపం ఒక కుటుంబానికి ఉంటే..? అన్న ప్రశ్నకు చిత్రరూపమే ‘మురారి’ అంటారు కృష్ణవంశీ.

దేశభక్తిని తెలిపే ‘ఖడ్గం’

తానొకసారి పనిమీద పాతబస్తీ వెళితే అక్కడ ఒకటి రెండు చోట్ల బిన్‌లాడెన్‌, ముషారఫ్‌ ఫొటోలు చూశారట కృష్ణవంశీ. దీంతో చాలా కోపం వచ్చిందట. వాళ్లకెలా చెప్పాలి? తదితర ప్రశ్నలకు సమాధానమే ‘ఖడ్గం’ సినిమా. సినిమా అవకాశాల కోసం దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న కొందరు కథానాయికల నిజజీవితం ఆధారంగా సినిమాలోని కొన్ని పాత్రలు కూడా సృష్టించారు కృష్ణవంశీ. ఇలా తర్వాత శ్రీఆంజనేయం.. చక్రం.. డేంజర్‌.. రాఖీ.. చందమామ.. శశిరేఖాపరిణయం.. మహాత్మ.. మొగుడు.. పైసా.. గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం తీశారు. ఇప్పుడు ‘రంగ మార్తాండ’ పేరుతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.

రమ్యకృష్ణను పరిచయం చేసింది బ్రహ్మానందమట!

అగ్రకథానాయిక రమ్యకృష్ణను వివాహం చేసుకున్న కృష్ణవంశీ ఆమెను తొలిసారి పరిచయం చేసింది బ్రహ్మానందమని చెబుతారు. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చేసరికి రమ్య చాలా పెద్ద హీరోయిన్‌. దూరం నుంచి చూస్తుండేవాళ్లం. నా గులాబీ సినిమా విడుదలయ్యాక బైక్‌సాంగ్‌ చూసి ‘తెలుగులో ఇలాంటి పాట వచ్చిందా’అని ఆశ్చర్యపోయిందట తను. తనని నాకు మొదటిసారి బ్రహ్మానందంగారు ‘అదిరింది అల్లుడు’ సెట్‌లో పరిచయం చేశారు. అప్పటినుంచి మాట్లాడుకోవటం, ఫోన్లూ, షికార్లూ, ఆరేళ్లు ఇట్టే గడిచిపోయాయి. తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకో బాబు రిత్విక్‌కృష్ణ’ అంటూ తన స్వీట్‌హోమ్‌ గురించి చెబుతారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోయేలా మరిన్ని చిత్రాలను కృష్ణవంశీ తీయాలని కోరుకుంటూ మరోసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని