Krishna Mukherjee: మేకప్‌ రూమ్‌లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు

నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్‌ డ్రామా షో ‘శుభ్‌ షగున్‌’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు.

Published : 27 Apr 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి కృష్ణ ముఖర్జీ బాలీవుడ్‌ డ్రామా షో ‘శుభ్‌ షగున్‌’ నుంచి బయటకు వచ్చేయడానికి గల కారణాన్ని వివరించారు. ఆ నిర్మాతపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమెకు మద్దతిస్తున్నారు. ఆ నిర్మాత తనను వేధించాడని చెప్పిన ఆమె ఆ కారణంగా తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు.

‘ఇది రాస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. నేను ఈ షో కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లాను. సోషల్ మీడియాలో అందంగా, ఆనందంగా ఉన్నట్లు  కనిపించాలని మా భావోద్వేగాలను దాచిపెడతాం. కానీ రియాలిటీ చాలా భయంకరంగా ఉంటుంది. నా భావాలను ఎప్పుడూ బయటకు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు మీ అందరితో నేను అనుభవించిన నరకాన్ని చెప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నేను ఏడాదిన్నర నుంచి ఎంతో కఠినమైన సమయాలను అనుభవిస్తున్నా. ‘శుభ్‌ షగున్‌’ షోను అంగీకరించడం నా జీవితంలో నేను తీసుకున్న చెత్త నిర్ణయాల్లో ఒకటి. దీన్ని ఓకే చేసినందుకు ఎన్నోసార్లు ఏడ్చాను. నిర్మాత నన్ను వేధించాడు. దుస్తులు మార్చుకుంటుంటే ఎన్నోసార్లు తలుపులు కొట్టేవారు. అనారోగ్యంగా ఉందని చెప్పినందుకు ఒకరోజు మేకప్‌రూమ్‌లో బంధించారు. నాకు రావాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదు. 5 నెలలుగా ఒక్క రూపాయి చెల్లించలేదు. అందుకే షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఈ విషయంపై ఎన్నోసార్లు బెదిరించారు. న్యాయం చేయమని ఎంతమందిని అడిగినా ఎవరూ స్పందించలేదు. దీనికి భయపడి వేరే ప్రాజెక్ట్‌లు చేయడం మానేశాను’ అని రాసుకొచ్చారు. తనకు న్యాయం కావాలని క్యాప్షన్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని