bigg boss 5: నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే.. ఇక నుంచి మిమ్మల్నే నామినేట్‌ చేస్తా!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఆసక్తికరంగా సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ సోమవారం జరిగింది.

Updated : 12 Oct 2021 09:05 IST

హైదరాబాద్‌: తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఆసక్తికరంగా సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ సోమవారం జరిగింది. నామినేషన్స్‌ ముందు ఇంటి సభ్యులు తీవ్ర చర్చల్లో మునిగిపోయారు. ఎవరిని నామినేట్‌ చేయాలి? ఎందుకు నామినేట్‌ చేయాలి? ఏం కారణాలు చెప్పాలంటూ ఒకరినొకరు చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని అనీ మాస్టర్‌ చెబుతూ ‘నామినేషన్స్‌ అనేసరికి అందరూ ఎంత బాగా చర్చించుకుంటున్నారో’ అని అన్నారు. ఇక కొత్త కెప్టెన్‌ ప్రియ, రేషన్‌ మేనేజర్‌ విశ్వల మధ్య ఫుడ్‌ విషయంలో చర్చ జరిగింది. రేషన్‌ మేనేజర్‌ అంటే అందరూ తిన్న తర్వాత తినాలని, వండిన ఆహారం అందరికీ సమానంగా పంచాలని ‘ప్రియోపదేశం’ చేసింది. అందుకు విశ్వ.. తనకు కావాల్సినది మాత్రమే తాను పెట్టుకున్నానని, ఇతరుల ఆహారం తానెందుకు తింటానని అన్నాడు. మరోవైపు హమీదా వెళ్లిపోయిన బాధ శ్రీరామ్‌ను వదల్లేదనుకుంటా. అర్ధరాత్రి నిద్రలో ఒకటే కలవరింతలు మొదలు పెట్టాడు. పెద్ద పెద్దగా అరవడంతో అతడికి ఏమైందా? అని కొందరు హౌస్‌మేట్స్‌ నిద్రలేచి చూశారు. విశ్వ అతడిని నిమురుతూ నిద్ర పుచ్చాడు.

మంట పెట్టిన బిగ్‌బాస్‌

గతవారం సీక్రెట్‌ నామినేషన్స్‌ చేసి, చివరిలో ఫలితాలు ప్రకటించిన బిగ్‌బాస్‌, ఈసారి నామినేషన్స్‌ సందర్భంగా హౌస్‌మేట్స్‌ మధ్య ‘మంట’ పెట్టాడు. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టం లేని ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటోలను మంటలో వేసి కాల్చేయాలని ఆదేశించాడు. నామినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టిన సన్నీ.. రవి, జెస్సీలను నామినేట్‌ చేశాడు.

అనీ మాస్టర్‌ Vs విశ్వ

ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మీరు కష్టపడి పైకి వచ్చానని చెబుతూ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అంటూ తనని నామినేట్‌ చేయడం ఇష్టం లేదని అనీ మాస్టర్‌ను విశ్వ నామినేట్‌ చేశాడు. దీంతో అనీ మాస్టర్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఇక నుంచి నన్ను అక్కా.. తొక్కా అని పిలవద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్‌ చేశాడు. ఇక రాజుల టాస్క్‌ సందర్భంగా జెస్సీ, ప్రియాంకలు తన నమ్మకాన్ని వమ్ము చేశారంటూ లోబో వారిని నామినేట్‌ చేశాడు. తాను గేమ్‌ ఆడటానికి వచ్చానని లోబోకు జెస్సీ కౌంటర్‌ వేశాడు. శ్రీరామ్‌ కెప్టెన్‌గా ఉండగా, ఒకవైపే మాట్లాడాడని సిరి అతడిని నామినేట్‌ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. ‘నా గేమ్‌ నా ఇష్టం, ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోబో, విశ్వలను ప్రియాంక నామినేట్‌ చేసింది. ‘చిన్న చిన్న కారణాలు చెప్పి నామినేట్‌ చేయడం, నమ్మకం గురించి మాట్లాడానికి సిగ్గుండాలి’ అంటూ లోబో ఫొటోను చించి మరీ మంటల్లో వేసింది. కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలంటూ విశ్వకు సలహా ఇచ్చింది. వెధవ రీజన్లు ఇవ్వకండి అంటూ విశ్వపై మండిపడింది. ‘సరిగా మాట్లాడు’ అని విశ్వగా అనగా, ‘నా ఇష్టం’ అని అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అంటూ షణ్ముఖ్‌, విశ్వలను అనీ మాస్టర్‌ నామినేట్ చేసింది. ఇక్కడ కూడా విశ్వ-అనీల మధ్య వాగ్వాదం జరిగింది.

బిగ్‌బాస్‌కు నువ్వేమైనా దేవుడివా?

నామినేషన్స్‌ సందర్భంగా శ్రీరామ్‌, షణ్ముఖ్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హౌస్‌మేట్స్‌ గురించి శ్రీరామ్‌ మాట్లాడుతూ.. అవసరానికి తగ్గట్టు బంధాలను వాడుకోవద్దని చెబుతూ సిరిని నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్‌ను నామినేట్‌ చేసి, ఏదో చెప్పటానికి ప్రయత్నించగా, ‘అంటే బిగ్‌బాస్‌లో నువ్వు దేవుడివా. నువ్వు చెప్పినట్లు వినాలా’ అంటూ షన్ను ఫైర్‌ అయ్యాడు. చివరిగా కెప్టెన్‌ ప్రియ మరోసారి సన్నీని నామినేట్‌ చేసింది. బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ప్రియ వదలకుండా సన్నీని నామినేట్‌ చేస్తూనే ఉంది. ఈ వారం కూడా నామినేట్‌ చేయడంతో సన్నీ మొదట నవ్వుకున్నాడు. ఆ తర్వాత ‘మీరు హౌస్‌లో ఉన్నన్ని రోజులు 100శాతం మిమ్మల్ని నామినేట్‌ చేస్తా. ఇది గ్యారెంటీ’ అని ప్రియతో సన్నీ అనగా, ‘ఏంటి వార్నింగ్‌ ఇస్తున్నావా? బెదిరిస్తున్నావా’ అని ప్రియ అంది. ‘లేదు నా గేమ్‌ గురించి చెబుతున్నా. చూసుకోండి’ అన్నాడు. రేషన్‌ మేనేజర్‌ విశ్వను ప్రియ నామినేట్‌ చేసింది. అందరికీ పెట్టకముందే తినేస్తున్నావని, తనని మేకప్‌ వేసుకుని కూర్చుంటావని అన్నాడని అతడి ఫొటోను మంటల్లో వేసింది. 'నా కడుపు నా ఇష్టం' అంటూ విశ్వ మండి పడ్డాడు. ఇలా వాడీవేడీ చర్చల మధ్య ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. షణ్ముఖ్‌, ప్రియాంక‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. మరి ఈ వారం ఎవరు సేవ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని