ఆసీస్‌పై విజయానికి కారణమదే

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా పేలవంగా ఆరంభించింనా అనంతరం విజయాలతో హోరెత్తించి టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లు ఓటమిపాలై వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చకున్న భారత్

Published : 09 Dec 2020 16:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా పేలవంగా ఆరంభించినా అనంతరం విజయాలతో హోరెత్తించి టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చకున్న భారత్ తర్వాత జరిగిన పొట్టిఫార్మాట్ సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే మంగళవారంతో భారత్×ఆసీస్ వన్డే, టీ20ల సిరీస్‌లు ముగిశాయి. డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికకానీ ఆటగాళ్లు తిరిగి స్వదేశానికి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు ప్రదర్శన గురించి ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

‘‘ఆస్ట్రేలియాలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత పోటీలో నిలవడం అంత సులువుకాదు. అయితే తొలి రెండు వన్డేల ఓటమి అనంతరం మేం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌గా భావించాం. చివరి వన్డే, మూడు టీ20ల్లో విజయం సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగాం. వన్డే, టీ20 సిరీస్‌ల్లో మేం ఎంతో నేర్చుకున్నాం. ప్రతిమ్యాచ్‌ సవాలే. సహచరులపై విశ్వాసంతో జట్టుగా ముందుకు సాగాం. వ్యక్తిగతంగా, జట్టుగా మరింత మెరుగవుతామని ఆశిస్తున్నా’’ - వైస్‌ కెప్టెన్, వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్ 

‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్ అవార్డును మా కుమారుడు అగస్త్యకు, కుటుంబానికి అంకితం చేస్తున్నాను. వారంతా నాకు అండగా నిలిచారు. అయితే మాది కచ్చితంగా సమష్టి విజయం. వ్యక్తిగత ప్రదర్శనతో కాకుండా జట్టుగా సిరీస్‌ను గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సత్తాచాటారు. నటరాజన్‌ ప్రదర్శన ప్రత్యేకం. ప్రతికూలత పరిస్థితుల్లో ఎంతో శ్రమంచి అతడు జట్టులోకి వచ్చాడు. అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాడు. మనపై మనకి విశ్వాసం ఉంటే ఏదైనా సాధిస్తామనడానికి అతడే ఉదాహరణ’’ - ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య

‘‘ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రాణించాలని భావించాను. మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. పేలవంగా పర్యటన ఆరంభించినా తిరిగి సత్తాచాటాడం గొప్ప విషయం’’ - స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్

‘‘రెండు వన్డేల ఓటమి తర్వాత గొప్పగా పోరాడాం. ప్రతిఒక్కరూ మనసు పెట్టి ఆడుతూ, తిరిగి పోటీలోకి వచ్చిన తీరు అద్భుతం. ఐపీఎల్ తర్వాత అందరీ ఆలోచన దృక్పథం గొప్పగా ఉంది. అయితే రెండున్నర నెలల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ బయోబబుల్‌లోనే ఉండటం అన్నింటికంటే కఠిన సవాలు అనిపించింది’’ - వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్

‘‘వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా బాగా ఆడింది. అయితే టీ20ల్లో మేం గొప్పగా సత్తాచాటాం. జట్టులోని అందరూ చక్కని ప్రదర్శన కనబరిచారు. హార్దిక్‌, నటరాజన్ ప్రత్యేకం. కంగారూల గడ్డ నుంచి టీ20 సిరీస్‌ విజయంతో తిరిగి వెళ్లడం గర్వంగా ఉంది’’ - బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే

ఇదీ చదవండి

ఇదంతా జరిగిందా అనిపిస్తోంది: నటరాజన్‌

క్రికెట్‌కు పార్థివ్‌ పటేల్‌ గుడ్‌బై

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని