Team India: అయ్యిందేదో అయిపోయింది... వచ్చే నాలుగేళ్లలో బీసీసీఐ ఏం చేయాలి?
వన్డే ప్రపంచ కప్ 2023 ఓడిపోయాం. ఆ రోజు మనది కాదు అని వదిలేయొచ్చు. అయితే జరిగిన తప్పులు, చేసిన పొరపాట్లు మరచిపోకూడదు. కాబట్టి 2027 ప్రపంచకప్ కోసం భారత్ మేనేజ్మెంట్, బీసీసీఐ ఏం చేయాలి?
వరుస విజయాలు జట్టులోని లోపాలను కవర్ చేస్తాయి. ఒక్క పరాజయం అందులోనూ మెగా ఈవెంట్ ఫైనల్లో ఓటమి లోపాలను బలంగా చూపిస్తుంది. ఇప్పుడు ప్రపంచ కప్ ఫైనల్ (ODI World Cup 2023)లో పరాజయం భారత్ (Team India)కు అదే పని చేస్తోంది. మరి ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి బీసీసీఐ (BCCI) వచ్చే నాలుగేళ్లలో ఏం చేయాలి?
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయింది. ఇలా అనేకంటే చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది అని చెప్పాలి. అంతా బాగుంది అనుకున్నారు కానీ... ఎక్కడో ఉన్న చిన్న లోపాలపై దృష్టిసారించలేదు. ఆ పని చేసిన ఆస్ట్రేలియా నాకౌట్ మ్యాచ్లో తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని, ఫైనల్కి వచ్చి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో మన జట్టు కూర్పులో, ఎంపికలో కొన్ని లోపాలు బయటకు వస్తున్నాయి. వాటిని బీసీసీఐ 2027 ప్రపంచకప్ నాటికి సరి చేయాల్సిన అవసరం ఉంది.
లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కడ?
దూకుడు మీద ఉన్న బ్యాటర్లను అడ్డుకోవడానికి బౌలింగ్లో వైవిధ్యం కావాలి. అది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తోనే వస్తుంది. మన జట్టులో ఉన్న ముగ్గురు పేసర్లు, బెంచ్ మీద ఉన్న ఇద్దరు పేసర్లు రైట్ హ్యాండ్ బౌలర్లే. దీనిని ప్రత్యర్థి జట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. మిగిలిన దేశాల్లో చూస్తే కచ్చితంగా ఓ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ జట్టులో ఉంటున్నాడు. మన దగ్గర ఆ పరిస్థితి రావాలంటే... లెఫ్టీలు కావాల్సిందే. ఆ దిశగా ప్రస్తుతం కనిపిస్తున్న బౌలర్లు అర్షదీప్ సింగ్, చేతన్ సకారియా, నటరాజన్.
బౌలర్ల లెంగ్త్ మార్చడానికి హిట్టర్లు ఉంటేసరి. అదే లైన్ను మార్చాలంటే కచ్చితంగా లెఫ్ట్ - రైట్ కాంబినేషన్ బ్యాటర్లు ఉండాల్సిందే. మన జట్టులో చూస్తే ఆరు, లేదా ఏడో డౌన్ వచ్చేంతవరకు ఎవరూ లేరు. మొత్తం 11 మంది జట్టులో ఇద్దరే లెఫ్టీలు. ఒకరు బౌలర్ కుల్దీప్ అయితే, మరొకరు ఆల్రౌండర్ జడేజా. దీంతో మన బ్యాటింగ్లో వైవిధ్యం ఉండటం లేదు. మిగిలిన జట్ల ఓపెనర్లలో ఒకరు రైట్, ఒకరు లెఫ్ట్. బాగా ఆడే వాళ్లను బయట కూర్చుండబెట్టడం కరెక్ట్ కాదు కానీ.. వైవిధ్యం కూడా అవసరమే. ఇలా చూసుకుంటే మనకు యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబె లాంటి వాళ్లు కనిపిస్తున్నారు. వీరిని సానపెడతారో లేక కొత్తవాళ్లను వెతికే పనిలో పడతారేమో చూడాలి.
స్పిన్కి భయపడుతున్నామా?
భారత బ్యాటర్లు అంటే స్పిన్ బాగా ఆడతారు అనే నానుడి ఉండేది. అనుకున్నట్లుగానే మొన్నీమధ్య వరకు మన బ్యాటర్లు స్పిన్లో అదరగొట్టేవారు. అయితే విదేశాల్లో ఉపయుక్తంగా ఉంటుంది అని పేస్ పిచ్లపై ప్రాక్టీసు, ఆట వల్ల స్పిన్కు దూరమయ్యారు అనిపిస్తోంది. ఈ ప్రపంచకప్లోనే స్పిన్నర్లను ఆడటానికి ఇబ్బందిపడుతున్నారు. ఆఖరికి పార్ట్ టైమ్ స్పినర్ల బౌలింగ్లోనూ ఇబ్బందిపడ్డారు. ఫైనల్లో ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్ లాంటివాళ్లను ఆడటంలో మన కంగారు మీరు చూసే ఉంటారు.
షార్ట్ అండ్ స్వీట్ బాల్స్
ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా ఏదో బలహీనత ఉంటుంది. దాన్ని అధిగమిస్తే దిగ్గజమవుతాడు. అలా మన జట్టులో ఉన్న స్టార్లకు కూడా ఇదే సమస్య ఉంది. దానినే ప్రత్యర్థి జట్లు క్యాచ్ చేసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యర్కు షార్ట్ బాల్స్తో పరీక్ష పెట్టి ఔట్ చేస్తున్నారు. శుబ్మన్ గిల్ అనుభవలేమిని ఊరించే బంతులతో క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్లనే కాదు సూర్య, రాహుల్ ఇలా అందరి బలహీనతలు బహిర్గతమైపోతున్నాయి. వీటిని అధిగమించాలి. దానికి తగ్గ సన్నద్ధత కావాలి. దానికి తగ్గట్టు మన థింక్ ట్యాంక్, సపోర్టింగ్ టీమ్, కోచింగ్ టీమ్ను సిద్ధం చేయాలి.. వాళ్లు ఆ పని పూర్తి చేయాలి.
పేస్ ఆల్రౌండర్.. పార్ట్ టైమర్లు
ప్రపంచకప్ లాంటి ఈవెంట్ కోసం మన దేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టులో ఒకే ఒక్క పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఉన్నాడు. ఆ మాటకొస్తే అతనికి రీప్లేస్మెంట్కి మరో ఆల్రౌండర్ లేడు. ఇది చాలు మన టీమ్ పరిస్థితి చెప్పడానికి. ప్రస్తుత పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్రౌండర్ల ప్రాముఖ్యత తెలియాలంటే మిగిలిన జట్లను చూస్తే సరి. ఆసీస్ సంగతే తీసుకోండి పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ పేరుకే స్టార్ పేసర్లు. కానీ బ్యాటు పట్టే అవకాశం వస్తే పూర్తిస్థాయి బ్యాటర్లగా మారిపోతారు. అలాంటివాళ్లు మనకూ కావాలి.
ఇక ఏ జట్టుకైనా పార్ట్ టైమర్లు ఎప్పుడూ ఎక్స్ ఫ్యాక్టర్ అని చెబుతుంటారు. గతంలో భారత్కు ఇలా సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఉండేవారు. ప్రస్తుత జట్టులో పార్ట్ టైమర్లు పెద్దగా కనిపించడం లేదు. మొత్తం ప్రపంచకప్లో మన జట్టు నెదర్లాండ్స్ మీదనే పార్ట్టైమర్లను వాడింది. అంతకుముందు సిరీస్ల్లో అయితే బూతద్దం పెట్టి వెతికితే ఎక్కడో కానీ కనిపించదు. కాబట్టి కొందరు బ్యాటర్లను పార్ట్టైమర్లుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఆల్రౌండర్లు లేని ఒత్తిడి కాస్త తగ్గుతుంది కూడా.
కుర్రాళ్లను సానబెట్టాలి
ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ తరఫు ఆడిన ప్లేయర్లలో వచ్చే ప్రపంచకప్కు ఆడేది ఒకరో, ఇద్దరో ఉంటారు. ఫామ్, ఫిట్నెస్, వయసు బట్టి చూస్తే సీనియర్లు అప్పటికి కష్టమే. కాబట్టి ఇప్పుడున్న శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి యువ క్రికెటర్లను సాన బెట్టాల్సి ఉంటుంది. అలాగే కొత్తవాళ్లను సిద్ధమూ చేయాలి. ఇది ఒక రోజులోనే, ఒక నెలలోనే అయిపోయేది కాదు. వచ్చే మూడేళ్లలో సిద్ధం చేసి.. ఆఖరిదైన నాలుగో ఏడాది ఓ జట్టుగా ఆడించి 2027 వన్డే ప్రపంచకప్కు సిద్ధం చేయాలి.
ఆఖరిగా... టీమ్ ఇండియాకు ప్రపంచకప్లు అందించింది ఇప్పటివరకు బెస్ట్ కెప్టెన్సీనే అని చెప్పొచ్చు. కాబట్టి 2027 ప్రపంచకప్ నాటికి అలాంటి బెస్ట్ కెప్టెన్ మరొకరు కావాలి. ఆ పని మేనేజ్మెంటే చేయాలి. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వాళ్లు వస్తారని చెప్పలేం కానీ. కప్ తెచ్చిపెట్టే వాళ్ల వారసుడు అయితే కావాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.