Virat Kohli: కరోనా బారిన పడిన విరాట్‌ కోహ్లీ! ఆలస్యంగా వెలుగులోకి..

గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టును ఆడేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లిన టీమ్‌ఇండియాను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ కరోనా బారినపడి జట్టుతోపాటు లండన్‌ విమానం ఎక్కలేదు.

Published : 23 Jun 2022 01:26 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదో టెస్టు ఆడేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా (Team India)ను కరోనా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ కరోనా బారినపడి జట్టుతోపాటు లండన్‌ విమానం ఎక్కలేదు. ప్రస్తుతం కొవిడ్ నుంచి కోలుకున్న అశ్విన్‌ బుధవారం ఇంగ్లాండ్‌ బయల్దేరే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజాగా మరో వార్త టీమ్‌ఇండియా అభిమానులను కలవరపెడుతోంది. కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఇటీవల కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మ, కూమార్తె వామికాతో కలసి విహారయాత్రకు మాల్దీవులు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక విరాట్‌ కరోనా బారిన పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు కరోనా నుంచి కోలుకున్న తర్వాతే టీమ్‌ఇండియాతో కలిసి ఇంగ్లాండ్‌ బయలుదేరాడని తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విరాట్‌ కూడా ఈ మేరకు ఎలాంటి సోషల్‌ మీడియా పోస్ట్‌లు పెట్టలేదు.

ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్‌లో జట్టుతోపాటు ఉన్నాడు. అక్కడ షాపింగ్‌ చేయడానికి వివిధ ప్రదేశాలకు వెళ్లి అభిమానులతో ఫొటోలు దిగాడు. రోహిత్‌ శర్మ కూడా షాపింగ్‌ అంటూ బయట తిరిగినట్లు ఫొటోలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరికీ బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే విరాట్‌కి ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిందని వార్తలు రావడం గమనార్హం. కరోనా సోకి తగ్గిన వెంటనే ఇలా ప్రజల మధ్య ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే మరోసారి కరోనా వచ్చే అవకాశముందని  బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వార్నింగ్‌ ఇచ్చిందని కూడా అంటున్నారు. కరోనా పరిస్థితుల వల్లే గతేడాది వాయిదా పడిన ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జులై 1 - 5 మధ్య జరుగుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని