IPL 2021: ఐపీఎల్ ఆడేందుకు ఆ ఇద్దరు ఆటగాళ్లకు అనుమతి

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త.  శ్రీలంక ఆటగాళ్లు వానిండు  హసరంగ, దుష్మంత

Published : 29 Aug 2021 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త.  శ్రీలంక ఆటగాళ్లు వానిండు హసరంగ, దుష్మంత చమీరా ఐపీఎల్-14 సీజన్‌లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు(యస్‌ఎల్‌సీ) అనుమతించింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు  ఐపీఎల్ ఆడేందుకు వీలుగా నిరభ్యంతర పత్రాన్ని(ఎన్‌వోసీ) అందించినట్లు ఆదివారం లంక బోర్డు  తెలిపింది. వానిండు  హసరంగ,  దుష్మంత చమీరాను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ఆర్సీబీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 

వీరిద్దరి చేరికతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారనుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్ జంపా స్థానాన్ని ఆల్‌రౌండర్‌ హసరంగ భర్తీ చేయనుండగా.. డానియల్ సామ్స్‌ స్థానంలో దుష్మంత చమీరా జట్టులోకి రానున్నాడు. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్లు అక్టోబర్‌ 10న తిరిగి శ్రీలంక జట్టుతో కలుస్తారు. అనంతరం టీ20 ప్రపంచకప్ సన్నద్ధత కోసం వార్మప్‌ మ్యాచులు ఆడనున్నారు. యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-14 పున:ప్రారంభంకానుంది. అక్టోబర్‌ 15న దుబాయ్‌లో ఫైనల్‌ నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని