Ravindra Jadeja: ధోనీపై కేకేఆర్‌ ట్వీట్‌.. దీటుగా బదులిచ్చిన రవీంద్ర జడేజా

టీమ్‌ఇండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గాలి తీసేశాడు. ఆదివారం కేకేఆర్‌ టీమ్‌ ధోనీని ఉద్దేశించి ఓ పోస్టు చేయగా...

Updated : 10 Jan 2022 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గాలి తీసేశాడు. ఆదివారం కేకేఆర్‌ టీమ్‌ ధోనీని ఉద్దేశించి ఓ పోస్టు చేయగా.. జడ్డూ దానికి కౌంటర్‌ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు ఆదివారం డ్రా గా ముగిసింది. చివరి క్షణాల్లో ఇంగ్లాండ్‌ ఆఖరి వికెట్‌ కాపాడుకొని ఈ మ్యాచ్‌లో ఓటమిపాలవ్వకుండా గట్టెక్కింది. అదే సమయంలో ఆసీస్‌ సైతం ఇంగ్లాండ్‌ టెయిలెండర్లను ఔట్‌ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది.

ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు. ఫీల్డర్లు అందరినీ బ్యాట్స్‌మెన్‌ చుట్టూనే ఏర్పాటు చేశాడు. దీంతో ఎలాగైనా ఆ ఒక్క వికెట్‌ సాధించి నాలుగో టెస్టును కైవసం చేసుకోవాలని చూశాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలమై ఇంగ్లాండ్‌ ఊపిరిపీల్చుకుంది. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో ఒకసారి గౌతమ్‌ గంభీర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ తరఫున బ్యాటింగ్‌ చేస్తున్న ధోనీకి అచ్చం ఇలాంటి ఫీల్డింగే ఏర్పాటు చేశాడు. ధోనీ డిఫెన్స్‌ను కట్టడి చేయాలని చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించాడు. తాజా మ్యాచ్‌లోని ఈ సన్నివేశం.. కేకేఆర్‌ జట్టుకు ఒకప్పటి గంభీర్‌ చర్యను గుర్తుకు చేసింది. దీంతో నాటి ధోనీ ఫొటోతో సహా తాజా మ్యాచ్‌లోని ఆండర్సన్‌కు ఏర్పాటు చేసిన ఫీల్డింగ్‌ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది. ‘టెస్టుల్లో క్లాసిక్ సన్నివేశం.. మీకు టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తు చేస్తే ఇలా ఉంటుంది’ అని పోస్టు చేసింది.

ఇది చూసిన చెన్నై ఆల్‌రౌండర్‌ జడేజా తనదైనశైలిలో స్పందించాడు. అది మాస్టర్‌ స్ట్రోక్‌ కాదు. కేవలం షో ఆఫ్‌ అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. మరోవైపు పలువురు ధోనీ అభిమానులు కూడా కేకేఆర్‌ టీమ్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు పోస్టులు మీమ్స్‌ షేర్ చేస్తూ కేకేఆర్‌ను ఆటపట్టిస్తున్నారు. కాగా, ఈ రెండు జట్లూ గతేడాది ఐపీఎల్ ఫైనల్లో చివరిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 27 పరుగులతో గెలుపొంది నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై టీమ్‌ ఐపీఎల్‌ 2022కు జడేజాను అట్టిపెట్టుకుంది. కెప్టెన్‌ ధోనీ, రుతురాజ్‌, మొయిన్‌ అలీలను కూడా ఆ జట్టు తమ వద్దే పెట్టుకోవడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని