Shami: షమీ కోలుకోవాలని అభిమాని ట్వీట్‌.. మరో క్రికెటర్‌పై వ్యంగ్యాస్త్రం!

సోషల్ మీడియా వచ్చాక తమ అభిప్రాయాలను తెలియజేయడానికి నెటిజన్లు ఏమాత్రం వెనకాడటం లేదు. సూటిగా చెప్పకుండా వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు.

Published : 14 Mar 2024 14:05 IST

ఇంటర్నెట్ డెస్క్: శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Shami) తన ఆరోగ్యంపై పోస్టు పెట్టాడు. అభిమానులు కూడా షమీ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఓ అభిమాని పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి.. ఇప్పుడీ సీజన్‌లో ముంబయి సారథిగా వచ్చిన హార్దిక్‌ పాండ్యను ఉద్దేశించి ఆ ట్వీట్‌ చేశాడని తెలుస్తోంది. సదరు ఫ్యాన్‌ పెట్టిన పోస్టును షమీ లైక్‌ చేయడం గమనార్హం. 

‘‘షమీ భాయ్‌ నువ్వు త్వరగా కోలుకుని వస్తావు. వన్డే ప్రపంచ కప్‌ సందర్భంగానూ గాయం బాధను తట్టుకొని 100 శాతం కష్టపడ్డావు. కానీ, ఓ ఆటగాడు మాత్రం గాయపడినట్లు నటించి ఆ టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు శ్రమిస్తున్నాడు’’ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీంతో పాండ్యను టార్గెట్‌ చేసి పెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేశారు.

అమిత్ షా ట్వీట్‌.. షమీ థ్యాంక్స్‌.. తర్వాత డిలీట్

మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. దానికి షమీ ధన్యవాదాలు చెప్పాడు. ‘‘షమీ భాయ్‌ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అనే పోస్టుకు షమీ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ సో మచ్‌ సర్’’ అని కామెంట్ పెట్టాడు. కానీ, దానిని వెంటనే షమీ డిలీట్ చేయడం విశేషం. ఎందుకు అలా చేశాడనేది అభిమానుల్లో చర్చకు తెరలేసింది. అయితే, అమిత్ షా ఒరిజినల్‌ ట్విటర్‌ ఖాతా నుంచి ఆ ట్వీట్ రాలేదు. కేంద్ర మంత్రి పేరు మీదనే నకిలీ ఖాతా సృష్టించి.. దానిని నుంచి పోస్టు పెట్టారు. అది గ్రహించిన షమీ తాను పెట్టిన కామెంట్‌ను డిలీట్‌ చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని