T20 World Cup 2021: సఫారీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన బంగ్లా

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. దీంతో బంగ్లాదేశ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 18.2 ఓవర్లలోనే 84 పరుగులు చేసి ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ముందు

Updated : 02 Nov 2021 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. దీంతో బంగ్లాదేశ్‌ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 18.2 ఓవర్లలోనే 84 పరుగులు చేసి ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహెదీ హాసన్ (27) ఒక్కడే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే మూడేసి, తబ్రెయిజ్‌ షంసి రెండు, డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ ఒక వికెట్ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్‌ మహమ్మద్‌ నయీమ్‌ (9), సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్‌ రహీమ్‌ (0) వరుసగా పెవిలియన్‌ చేరారు. కగిసో రబాడ వేసిన నాలుగో ఓవర్లో నయీమ్‌, సర్కార్ వరుస బంతుల్లో ఔట్ కాగా.. ఆరో ఓవర్లో రహీమ్‌.. క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ మహ్మదుల్లా (3), మరో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని ఆశించినా నిరాశే ఎదురైంది. అన్రిచ్‌ నోర్జే వేసిన ఎనిమిదో ఓవర్లో అతడు మార్క్‌క్రమ్‌కి క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే అఫీఫ్‌ హోసైన్ (0) బౌల్డయ్యాడు. దీంతో పది ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 40 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్న లిటన్‌ దాస్ (24)‌.. తబ్రెయిజ్‌ షంసి వేసిన 12వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆఖర్లో మెహెదీ హాసన్‌ (27) వేగంగా ఆడుతున్న క్రమంలో నోర్జేకి రిటర్న్‌ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. చివర్లో వచ్చిన షమీమ్‌ హోసైన్‌ (11), టస్కిన్‌ అహ్మద్‌ (3), నసూమ్‌ అహ్మద్‌ (0)  విఫలమయ్యారు. షోరిఫుల్‌ ఇస్లామ్‌ (0) నాటౌట్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని