Nayeem: నయీం కేసులో కుదుపు!

మాజీ నక్సలైట్‌, కరడుగట్టిన నేరగాడు నయీం దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని.. బాధితులకు తిరిగి ఇచ్చే ప్రక్రియకు గండి పడింది.

Updated : 13 Oct 2022 09:15 IST

దోచుకున్న ఆస్తుల స్వాధీనం ప్రక్రియకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ నక్సలైట్‌, కరడుగట్టిన నేరగాడు నయీం దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని.. బాధితులకు తిరిగి ఇచ్చే ప్రక్రియకు గండి పడింది. బినామీ ఆస్తుల (నిరోధక) చట్టం కింద వాటిని స్వాధీనం చేసుకోవడం కుదరదని అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో దర్యాప్తు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి. నయీం దందాలతో భూములు, ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్న వేల మంది పరిస్థితి ఈ పరిణామంతో అగమ్యగోచరంగా మారింది. నక్సలైట్‌ ఉద్యమం నుంచి బయటకు వచ్చి, పోలీసులకు లొంగిపోయాక నయీం ఇంచుమించు సమాంతర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, కిడ్నాపులు, హత్యలతో బెంబేలెత్తిస్తూ వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నాడు. ప్రాణభయంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు జంకారు. 2016 ఆగస్టు 8న షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌లో నయీం మరణించాక.. వారంతా పెద్దఎత్తున పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 250కిపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 2 లక్షల గజాల ఇళ్ల స్థలాలు, 29 భవనాలను నయీం తన అనుచరులు, బంధువులు పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. పోలీసులతో పాటు అదాయపన్నుశాఖ కూడా రంగప్రవేశం చేసింది. బినామీ ఆస్తుల (నిరోధక) చట్టం ప్రకారం నయీం ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలుపెట్టింది. రెండు దఫాలుగా ఆయా ఆస్తులను ఎటాచ్‌మెంట్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. నయీం అనుచరులు, బంధువులకు తగిన ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ వందల ఎకరాల భూములు వారి పేరుతో ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత వారికి లేదని, వారంతా బినామీలేనని అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై నయీం కుటుంబ సభ్యులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నయీం ఆస్తులపై బినామీ చట్టాన్ని ప్రయోగించడాన్ని కొట్టివేస్తూ ఇటీవల ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. 2016 తర్వాత బదిలీ అయిన ఆస్తులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నట్లు తెలిసింది. స్వాధీన ప్రక్రియ ప్రారంభించిన నయీం ఆస్తులన్నీ అంతకుముందే చేతులు మారినందున.. వాటిపై బినామీ చట్టాన్ని ప్రయోగించడం కుదరదని స్పష్టం చేసినట్లు సమాచారం.

నయీం బలవంతంగా స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి బాధితులకు అప్పగిస్తామని ప్రభుత్వం గతంలో అనేకమార్లు చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. నయీం దోచుకున్న ఆస్తులను బాధితులకు అందించే ప్రయత్నాలు ఆగవని ఓ పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని