Hyderabad: డొనేషన్‌ కట్టలేదని చెప్పండి ప్లీజ్‌.. తల్లిదండ్రులకు కాలేజీల నుంచి ఫోన్లు

శంషాబాద్‌ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి బుధవారం ఓ విద్యార్థిని తండ్రికి ఫోన్‌ వచ్చింది. ‘మీ పాప మా కళాశాలలో చదువుతోంది కదా. ఎవరైనా బయటి వ్యక్తులు ఫోన్‌ చేసి కళాశాలకు డొనేషన్‌ కట్టారా అని అడిగితే.. చెల్లించామని చెప్పకండి.

Updated : 24 Nov 2022 09:35 IST

ఐటీ దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి బుధవారం ఓ విద్యార్థిని తండ్రికి ఫోన్‌ వచ్చింది. ‘మీ పాప మా కళాశాలలో చదువుతోంది కదా. ఎవరైనా బయటి వ్యక్తులు ఫోన్‌ చేసి కళాశాలకు డొనేషన్‌ కట్టారా అని అడిగితే.. చెల్లించామని చెప్పకండి. మీకు, మాకు ఇబ్బంది లేకుండా చూసుకోండి’ అని కళాశాల ప్రతినిధి చెప్పారు. ఎందుకని ఆరా తీస్తే.. ఐటీ దాడుల నేపథ్యంలో తల్లిదండ్రులందరికీ ఫోన్లు చేస్తున్నట్లు ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు.

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కళాశాలలు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. కళాశాలల్లో డొనేషన్లపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల యాజమాన్యాలు.. తాము డొనేషన్‌ తీసుకున్న విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

లెక్కలోకి రాకుండా.. రూ.లక్షల్లో వసూలు

నగర శివారులోని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రవేశాల కోసం ఏకంగా రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేశాయి. కళాశాల స్థాయి, బ్రాంచిని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలలు బీటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.12-15 లక్షలు వసూలు చేశాయి. మిగిలిన ఫీజులన్నీ దీనికి అదనం. ఒకే దఫాగా నగదు రూపంలో వసూలు చేసిన డొనేషన్‌ మొత్తాలకు పక్కా రసీదులివ్వరు. ఇవన్నీ కళాశాలల లెక్కల్లో కనిపించవు. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని