Malla Reddy: మల్లారెడ్డి X ఐటీ

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చోరీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Updated : 25 Nov 2022 08:30 IST

అధికారి ఫిర్యాదుతో మంత్రిపై చోరీ కేసు
ఆయన కుమారుడి ఫిర్యాదుతో ఐటీ డిప్యూటీ డైరెక్టర్‌పై దోపిడీ కేసు
ఐటీ సోదాల నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా
సీఆర్పీఎఫ్‌ బలగాల రంగ ప్రవేశంతో ఠాణా గేటుకు తాళం
ముగిసిన తనిఖీలు.. మంత్రి సహా 16 మందికి ఐటీ నోటీసులు

ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే - కంటోన్మెంట్‌: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చోరీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆదాయపన్నుశాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరోవైపు.. తప్పుడు నివేదికపై తన సోదరుడితో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారంటూ మంత్రి తనయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పైనా కేసు నమోదైంది. ఓ దశలో ఆవేశానికి గురైన మంత్రి.. ఐటీ అధికారి చేయి పట్టుకొని తన కారులోనే ఠాణాకు తీసుకెళ్లడం కలకలం రేపింది. మల్లారెడ్డితోపాటు కుటుంబసభ్యులు, బంధువులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, సంస్థల్లో ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే సోదాలు ఆరంభం కాగా.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సినీఫక్కీలో ఈ తరహా హైడ్రామా నెలకొంది. తెల్లవారుజాము వరకు హడావుడి కొనసాగింది. గురువారంతో సోదాలు ముగించిన ఐటీ అధికారులు.. మల్లారెడ్డి సహా 16 మంది విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఐటీ సోదాలు కొనసాగుతుండగానే.. మంత్రి మల్లారెడ్డి ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్లారు. గన్‌మెన్‌ లేకుండానే కారులో బయలుదేరిన ఆయన నేరుగా సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి చేరుకుని.. చికిత్స పొందుతున్న కుమారుడు మహేందర్‌రెడ్డి వద్దకు వెళ్లారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్ల డొనేషన్లకు సంబంధించి రూపొందించిన నివేదికలో మహేందర్‌రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని తెలియడంతోనే మంత్రి హడావుడిగా వెళ్లారనే ప్రచారం జరిగింది. మహేందర్‌రెడ్డి ఇంట్లో తనిఖీలకు సంబంధించిన పత్రాలపై ఆయనతో సంతకాలు చేయించేందుకు ఆసుపత్రిలో వేచి ఉన్న ఆదాయపన్నుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌కు, మంత్రికి ఈ సందర్భంగా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రత్నాకర్‌ నుంచి సెల్‌ఫోన్‌, సెర్చ్‌ వారంట్‌, ల్యాప్‌టాప్‌ను మంత్రి లాక్కున్నారని అభియోగం. సోదాలు చేస్తున్న మిగిలిన అధికారుల వద్ద ఈ విషయాన్ని తేల్చుకుందామంటూ.. మంత్రి రత్నాకర్‌ను తన కారులోనే వెంటబెట్టుకుని బోయిన్‌పల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఐటీ అధికారులంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆయన రత్నాకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి.. రత్నాకర్‌ చేయి పట్టుకొని ఒకరకంగా బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మంత్రి పోలీస్‌ స్టేషన్‌కు వస్తున్నట్లు బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌కు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫోన్‌ చేశారు. కాసేపటికి మల్లారెడ్డి తన చిన్న కుమారుడు భద్రారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్‌తో కలిసి ఠాణాకు వచ్చారు. ఆదాయపన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారి రత్నాకర్‌పై పోలీసులు ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

రాత్రి 2 గంటలు.. రంగంలోకి సీఆర్పీఎఫ్‌ బలగాలు

పోలీస్‌స్టేషన్‌ నుంచి మంత్రి తన కారులోనే రత్నాకర్‌ను తీసుకెళ్లారు. రాత్రి 1.50 గంటల సమయంలో రత్నాకర్‌ మళ్లీ ఒంటరిగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. కాసేపటికే పదుల సంఖ్యలో సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికొచ్చి.. ఠాణాను తమ అధీనంలోకి తీసుకున్నంత పనిచేశారు. లోపలికి ఎవరినీ రానీయొద్దంటూ వారు సూచించడంతో బోయిన్‌పల్లి పోలీసులు స్టేషన్‌ గేటుకు తాళం వేశారు. తర్వాత మంత్రిపై రత్నాకర్‌ ఫిర్యాదు చేశారు. ‘విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వెళ్లి సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేస్తుండగా.. మంత్రి తన అనుచరులతో వచ్చి ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నా నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, వారంట్లను లాక్కున్నారు. వాటిని చించేసే ప్రయత్నం చేశారు. నా విధుల్ని అడ్డుకున్నారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 379 (చోరీ), 342 (బలవంతంగా నిర్బంధించడం), 353 (దాడి), 201 (నేర ఆధారాల్ని మాయం చేయడం), 203 (నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 రెడ్‌విత్‌ 34 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో సీఐకి మంత్రి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్‌కాల్‌ను సీఆర్పీఎఫ్‌ బలగాలు మాట్లాడనీయలేదని సమాచారం.

ల్యాప్‌టాప్‌తో మంత్రి అనుచరుడి ప్రత్యక్షం

సీఆర్పీఎఫ్‌ బలగాలు ఠాణాలో ఉండగానే మంత్రి అనుచరుడొకరు ల్యాప్‌టాప్‌తో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దాన్ని సీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ల్యాప్‌టాప్‌ చోరీపై ఫిర్యాదు ఉండటంతో సీఐ దాన్ని తీసుకోకుండా.. అతడిని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి ల్యాప్‌టాప్‌ను మెయిన్‌గేట్‌ వద్ద దిమ్మెపై ఉంచి వెళ్లిపోయాడు. రత్నాకర్‌ దాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో సీఐ పంచనామా నిర్వహించి.. దాన్ని ఠాణాలో భద్రపరిచారు. ఇదంతా జరిగేసరికి తెల్లవారుజాము 3.50 గంటలైంది. తర్వాత ఆ ల్యాప్‌టాప్‌ తనది కాదని పోలీసులతో ఐటీ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.

జీరో ఎఫ్‌ఐఆర్‌.. దుండిగల్‌ ఠాణాకు బదిలీ

ఇరువర్గాల ఫిర్యాదులపై బోయిన్‌పల్లి పోలీసులు రెండు జీరో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనిది కావడంతో అక్కడికి బదిలీ చేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో దుండిగల్‌ సీఐ రమణారెడ్డి బోయిన్‌పల్లి ఠాణాకు వచ్చి సీల్డ్‌కవర్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ పత్రాల్ని తీసుకెళ్లారు. రాత్రి బోయిన్‌పల్లి ఠాణా వద్ద హడావుడి నెలకొనడంతో రాత్రి విధుల్లో ఉన్న సౌత్‌జోన్‌ అదనపు డీసీపీ ఆనంద్‌, గోపాలపురం ఏసీపీ సుధీర్‌ ఠాణాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.


సోమవారం నుంచి విచారణ

మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సంస్థల్లో ఐటీ సోదాలు గురువారం ముగిశాయి. భారీమొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాని మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మల్లారెడ్డి సహా 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, కళాశాలల ప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. వచ్చే సోమవారం నుంచి వీరు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని