కుటుంబ వివాదాల పరిష్కారానికి కల్పతరు

కుటుంబ వివాదాలకు సంబంధించి అన్నిరకాల పరిష్కారాలకు సమీకృత కోర్టుల సముదాయమైన ‘కల్పతరు’ ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ అన్నారు.

Published : 19 Mar 2023 03:05 IST

న్యాయమూర్తులు, న్యాయవాదులది కీలక పాత్ర
సమీకృత కోర్టుల ప్రారంభ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కుటుంబ వివాదాలకు సంబంధించి అన్నిరకాల పరిష్కారాలకు సమీకృత కోర్టుల సముదాయమైన ‘కల్పతరు’ ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని కుటుంబ న్యాయస్థానాలనూ ఒకేచోటుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. పురానాహవేలిలో గతంలో ఉన్న రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌ భవనాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో ఏర్పాటుచేసిన సమీకృత కోర్టుల సముదాయం ‘కల్పతరు’ను శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ మాట్లాడుతూ కల్పతరు అంటే ఏది కావాలంటే అది ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ పేరుతో ఉన్న కోర్టు సముదాయం విడాకులు కావాలంటే విడాకులు, కలిసి జీవించి సుఖంగా ఉంటామంటే అదీ ఇస్తుందని వివరించారు.  దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయస్థానాల్లోనే 11.4 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కుటుంబ న్యాయస్థానాలు లేని ప్రాంతాల్లోని కేసులనూ కలిపితే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందన్నారు. తెలంగాణలో 9 వేల కుటుంబ వివాదాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయవాదులది కీలకపాత్ర అని తెలిపారు. సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ మాట్లాడుతూ సమాజంలో నాగరికత కుటుంబ సంబంధాలపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతికూల వ్యాజ్యాల కంటే మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం మంచిదన్నారు. భవిష్యత్తులో మీడియేషన్‌ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ కోర్టు సముదాయం కక్షిదారులకు ఉపయుక్తమవుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కుటుంబ వివాదాలకు ప్రత్యేక కోర్టు ఉండాలన్న వాదన 1958 నుంచి  ఉండగా.. 1984లో చట్టం వచ్చిందని.. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని అన్నారు. 28 ఏళ్లు పూర్తయ్యాక ఇలాంటి అద్భుత భవనం ఏర్పాటైందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 36 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయని చెప్పారు. ఇతర వివాదాలకంటే కుటుంబ వివాదాలు భిన్నంగా ఉంటాయన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ, సరికొత్త సౌకర్యాలతో ఈ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీడియేషన్‌ సెంటర్‌, ధ్యాన కేంద్రం, మనోవికాస కేంద్రం, వైద్యకేంద్రం, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ భవనం రూపకల్పనకు, కార్యాచరణకు తీసుకువచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావుతో పాటు ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, నల్సార్‌ వైస్‌ఛాన్సలర్‌ శ్రీకృష్ణదేవరావు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు వార్షిక నివేదిక ‘న్యాయ మయూఖ’ను ఆవిష్కరించారు.


బమ్మెరలో అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభం

జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటైన ‘అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌’ను శనివారం జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ పి.సంజయ్‌కుమార్‌, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లు ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. బమ్మెరలో జనగామ ఇన్‌ఛార్జి జడ్జి బాలభాస్కర్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆంజనేయులు, నల్సార్‌ రిజిస్ట్రార్‌ విద్యుల్లతారెడ్డి, లీఫ్స్‌ అధ్యక్షుడు ఎం.సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. దుక్కి మొదలుకొని పంట మార్కెట్‌లో విక్రయించడం వరకు అన్ని దశల్లో రైతుకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం పలు చట్టాలను చేసిందని, ఆ చట్టాలకు సంబంధించి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ద్వారా ఉచిత న్యాయసాయం అందిస్తామని సునీల్‌కుమార్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని