Viral Video: తోటి ప్రయాణికుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించాడు..!

పక్కనున్నవారు ఏమైపోతేనేం.. మనం మాత్రం బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో ఓ వ్యక్తి.. ప్రమాదంలో ఉన్న మరో వ్యక్తి కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు.

Published : 05 Aug 2021 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పక్కనున్నవారు ఏమైపోతేనేం.. మనం మాత్రం బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో ఓ వ్యక్తి.. ప్రమాదంలో ఉన్న మరో వ్యక్తి కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. చక్రాల కుర్చీతో సహా రైలు పట్టాలపై పడిన తోటి ప్రయాణికుడిని మానవత్వంతో ఆ వ్యక్తి కాపాడిన దశ్యాలను అక్కడున్న కొందరు తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తన చక్రాల కుర్చీతో సహా రైలు పట్టాలపై పడ్డాడు. కొద్ది క్షణాల్లో ప్లాట్‌ఫాంపైకి రైలు రానున్నట్టు తెలిసినప్పటికీ.. అతడిని కాపాడేందుకు ఓ వ్యక్తి  పట్టాలపైకి దూకాడు. ముందుగా చక్రాల కుర్చీని ప్లాట్‌ఫాంపైకి విసిరేశాడు. ఆ తర్వాత అతడిని ప్లాట్‌ఫాంపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు.  ఆ వ్యక్తికి మరికొందరు ప్రయాణికులు సహకరించడంతో.. పట్టాలపై పడిన వ్యక్తిని క్షణాల్లో ప్లాట్‌ఫాం పైకి చేర్చాడు. తర్వాత కొద్ది క్షణాల్లోనే ప్లాట్‌ఫాం మీదకి రైలు వస్తున్న దశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. అయితే ఆ వ్యక్తి పట్టాలపై ఎలా పడిపోయాడో మాత్రం ఆ వీడియోలో రికార్డు కాలేదు. ప్రమాదంలో ఉన్న తోటి ప్రయాణికుడిని కాపాడినందుకు ఆ వ్యక్తిని ప్రస్తుతం లక్షలాదిమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షల మందికిపైగా వీక్షించారు. 1.5 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. 

 

 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని