Ukraine crisis: ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సేనల దాష్టీకం.. 400 లైంగిక దాడి కేసులు!

గత 63 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో పుతిన్‌ సేనలు మరింతలా రెచ్చిపోతూనే ఉన్నాయి. .....

Updated : 28 Apr 2022 02:58 IST

కీవ్‌: గత 63 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో పుతిన్‌ సేనలు మరింతలా రెచ్చిపోతూనే ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటివరకు 24వేల మందికి పైగా సైనికుల్ని కోల్పోయినా రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌, ఖర్కివ్‌ ..తదితర ప్రాంతాలపై దాష్టీకాలను కొనసాగిస్తూనే ఉంది. తమ లక్ష్యం సామాన్య పౌరులు కాదు.. సైన్యమే టార్గెట్‌ అంటూ యుద్ధం ఆరంభించిన పుతిన్‌ సేనలు.. ఉక్రెయిన్‌లోని మహిళలు, చిన్నారులనూ వదలడంలేదు. దాదాపు 400 లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడమే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు సృష్టిస్తోన్న అరాచకానికి నిదర్శనం. రష్యా సైనికులపై దాదాపు 400లకు పైగా అత్యాచార కేసులు నమోదైనట్టు ఉక్రెయిన్‌ అంబుడ్స్‌మెన్‌ లియుడ్‌మైలా డెనిసోవా వెల్లడించారు. లైంగిక హింసకు సంబంధించి నివేదించేందుకు హాట్‌లైన్‌ ఏర్పాటు చేయగా.. ఏప్రిల్‌ 1 నుంచి 14 మధ్య కాలంలో తమ కార్యాలయానికి దాదాపు 400లకు పైగా లైంగిక హింసకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 

24,200 మంది రష్యా సైనికులు మృతి!

రష్యా సేనల్ని ఉక్రెయిన్‌ బలగాలు దాటుగా తిప్పికొడుతున్నాయి. గత 63 రోజలుగా కొనసాగుతున్న యుద్ధంలో 24,200 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా 185 విమానాలు, 155 హెలికాప్టర్లు 939 ట్యాంకులు, 2342 సాయుధ శకటాలు, 76 ఇంధన ట్యాంకులు, 8 నౌకలు సహా భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసి రష్యాను దెబ్బతీసినట్టు పేర్కొంది. 

రష్యా 1300 క్షిపణులు పేల్చింది!

ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు వరకు రష్యా 1300 క్షిపణుల్ని ప్రయోగించినట్టు ఉక్రెయిన్‌ డిప్యూటీ రక్షణ మంత్రి అన్నా మలయార్‌ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో క్షిపణుల నిల్వలు సగానికి పడిపోయాయన్నారు. రష్యా యుద్ధంలో 217 మంది చిన్నారులు మృతిచెందగా.. 610 మందికి పైగా గాయపడినట్టు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది. ఏప్రిల్‌ 27 వరకు గణాంకాల ప్రకారం  కీవ్‌, ఖర్కివ్‌ నగరాల్లోనే మరణాలు ఎక్కువని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని