Turkey: ‘కదులుతోంది..’ కొంప ముంచుతోంది..!

కొద్దిగంటల వ్యవధిలో వరుసగా వచ్చిన పెను భూకంపాల వల్ల తుర్కియే చిగురుటాకులా కంపించింది. పేకమేడల్లా కూలిన భవనాల కింద ఛిద్రమైన జీవితాలతో ఆ దేశం మరుభూమిని తలపిస్తోంది.

Updated : 07 Feb 2023 08:11 IST

భౌగోళికంగా భూకంప కూడలిలో తుర్కియే!
ఫలకాల కదలికలతో పెను విపత్తులు
ఈనాడు ప్రత్యేక విభాగం

కొద్దిగంటల వ్యవధిలో వరుసగా వచ్చిన పెను భూకంపాల వల్ల తుర్కియే చిగురుటాకులా కంపించింది. పేకమేడల్లా కూలిన భవనాల కింద ఛిద్రమైన జీవితాలతో ఆ దేశం మరుభూమిని తలపిస్తోంది. తుర్కియే చరిత్ర మొత్తం భూకంపాలమయం. ఆ దేశంలోని 98 శాతం భూభాగానికి ప్రకంపనల ముప్పు ఉంది. ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌ సహా మూడోవంతు భాగానికి ఆ ప్రమాదం చాలా ఎక్కువ. 2020లోనే అక్కడ 33వేల ప్రకంపనలు నమోదయ్యాయి. అందులో 4.0 తీవ్రతను మించినవి 322 ఉన్నాయి. భౌగోళికంగా చాలా సంక్లిష్టమైన కూడలిలో ఉండటం, సన్నద్ధత లోపించడం వంటి కారణాలు ఈ దేశానికి పెను శాపాలయ్యాయి.

ఎందుకింత ముప్పు?

భూమి పైపొరలో 15 ఫలకాలు (టెక్టానిక్‌ ప్లేట్స్‌) ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్‌ అంటారు. ఫలకాలు కదులుతూ ఉంటాయి. దానివల్ల వాటి అంచుల మధ్య రాపిడి జరుగుతుంటుంది. ఒక్కోసారి ఈ ఫాల్ట్స్‌ వెంబడి ఆకస్మిక కదలికలు చోటుచేసుకొని, పెను శక్తి వెలువడుతుంది. అది భూకంపం రూపంలో ఉపరితలం వరకూ వ్యాప్తి చెందుతుంది.

కొన్నిసార్లు రాపిడి వల్ల రెండు ఫలకాలు ‘చిక్కుకుపోవచ్చు’. ఆ తర్వాత నేలలో భారీగా ఒత్తిడి పేరుకుపోవడం వల్ల మళ్లీ అవి విడిపోతాయి. దీనివల్ల కూడా భూకంపాలు ఏర్పడుతుంటాయి.

తుర్కియే అనతోలియన్‌ భూఫలకంపై ఉంది. దీనికి ఉత్తరాన యురేషియా, దక్షిణాన ఆఫ్రికా ఫలకాలు ఉన్నాయి. తూర్పున చిన్నదైన అరేబియన్‌ ఫలకం ఉంది. అంటే.. భౌగోళికంగా కీలక కూడలిలో తుర్కియే ఉందన్నమాట! ఇక్కడ ఫాల్ట్స్‌ ఎక్కువ.

ముఖ్యంగా ఉత్తర అనతోలియన్‌ ఫాల్ట్‌ (ఎన్‌ఏఎఫ్‌) వెంబడి ముప్పు తీవ్రత ఎక్కువ. ఈ అంచు.. ఇస్తాంబుల్‌ నగరానికి దక్షిణ భాగం నుంచి తుర్కియే ఈశాన్య ప్రాంతం వరకూ వ్యాపిస్తోంది. అక్కడ అనతోలియన్‌, యురేషియన్‌ ఫలకాలు కలుసుకుంటాయి. ఎన్‌ఏఎఫ్‌ వెంబడి పెను భూకంపాలు వచ్చాయి. 1999లో 17వేల మంది మరణానికి కారణమైన ప్రకంపనలకు మూలం ఇక్కడే ఉంది.

తుర్కియే కింద తూర్పు అనతోలియన్‌ ఫాల్ట్‌ కూడా ఉంది. అది మధ్యధరా ప్రాంతం వరకూ 650 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఆఫ్రికా, అరేబియా భూఫలకాలను వేరు చేసే ‘గ్రేట్‌ రిఫ్ట్‌ సిస్టమ్‌’ ఉత్తర భాగం వరకూ ఇది వ్యాపించింది. తాజా భూకంపం తూర్పు ఆనతోలియన్‌ ఫాల్ట్‌ వెంబడే వచ్చింది.

పెద్దవైన ఆఫ్రికా, అరేబియా ఫలకాలు తమ కదలికల ద్వారా తుర్కియే కిందున్న అనతోలియన్‌ ఫలకాన్ని పక్కకు నెట్టేస్తున్నాయి. అయితే అది ఉత్తరం వైపునకు కదలకుండా యురేషియన్‌ ఫలకం అడ్డుపడుతోంది. ఈ క్రమంలో అనతోలియన్‌ ఫలకంపై తీవ్ర ఒత్తిడి పేరుకుపోతుంటుంది. దీనివల్ల ఫాల్ట్స్‌ వెంబడి అకస్మాత్తుగా కదలికలు చోటుచేసుకొని.. పెను భూకంపాలు వస్తుంటాయి.

ఎందుకంత ప్రాణనష్టం?

భూకంపాల ముప్పు తీవ్రస్థాయిలో పొంచి ఉన్నప్పటికీ తుర్కియేలో సన్నద్ధత తక్కువే. ఇస్తాంబుల్‌ సహా అనేక నగరాల్లో భవనాలను భూ ప్రకంపనలను తట్టుకునేలా నిర్మించలేదన్న విమర్శలు ఉన్నాయి. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకుండా నాసిరకం పదార్థాలు, పెళుసు కాంక్రీట్‌తో వాటిని సిద్ధం చేశారని, దాని ఫలితమే ఈ విధ్వంసమని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో పేదరికం స్థాయి కూడా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమైంది. 2022 డిసెంబరు నాటికి ఇక్కడ ద్రవ్యోల్బణం 64.2 శాతంగా ఉంది. ఇది 24 ఏళ్ల గరిష్ఠం.

కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీకి తుర్కియే సైన్యానికి మధ్య జరుగుతున్న పోరు వల్ల అనేక గ్రామాల్లోని ప్రజలు నగరాలు, పట్టణాల్లో భద్రత లేని నిర్మాణాల్లో తలదాచుకుంటున్నారు. అవి చిన్నపాటి ప్రకంపనలకే కుప్పకూలుతున్నాయి.

తుర్కియేలో 36 లక్షల మంది సిరియన్‌ శరణార్థులు ఉన్నారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటోంది. చాలా బలహీనమైన నిర్మాణాల్లో వీరు నివాసముంటున్నారు. దీనివల్ల ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది.

తాజా భూకంప కేంద్రం.. నేల నుంచి 18 కి.మీ లోతులోనే ఉంది. అందువల్లే పెను విధ్వంసాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రం లోతు ఎంత ఎక్కువగా ఉంటే.. నష్టం అంత తక్కువగా ఉంటుంది.

ప్రకృతి విపత్తుల కారణంగా తుర్కియేలో జరుగుతున్న ప్రాణనష్టంలో భూకంపాల వాటా: 60 శాతం


తుర్కియే భూకంపాన్ని ముందే హెచ్చరించిన పరిశోధకుడు

ఫిబ్రవరి 3న ట్వీట్‌, 6న ప్రమాదం

క్షిణ మధ్య తుర్కియే, జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌లలో భారీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయని మూడు రోజుల ముందే ఓ పరిశోధకుడు హెచ్చరించినట్లు వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌ సంస్థ ‘సోలార్‌ సిస్టమ్‌ జియోమెట్రీ సర్వే’(ఎస్‌ఎస్‌జీఈఓఎస్‌)కు చెందిన భూగర్భశాస్త్ర పరిశోధకుడు ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌.. ‘త్వరలోనే దక్షిణ మధ్య తుర్కియే, జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్‌ చేశారు. ఆయన అంచనాల ప్రకారమే ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు విలయాన్ని సృష్టించాయి. ఈ ప్రమాదం తనను ఎంతో కలచివేసిందని ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌ స్పందించారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా భూకంపం వచ్చే సమయాన్ని అంచనా వేశానని తెలిపారు. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈయన చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. అయితే, ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌ ముందస్తుగా చేసిన హెచ్చరికలపై పలు విమర్శలు కూడా వచ్చాయి. భూకంపాలను అంచనా వేసేందుకు కచ్చితమైన విధానమేదీ ప్రస్తుతం అందుబాటులో లేదంటూ కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. గతంలో ఆయన చేసిన అంచనాలు తప్పాయని వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రాంక్‌ అంచనాలు నిజం కావడంతో లక్షల సంఖ్యలో నెటిజన్లు ఆయన ట్వీట్లు చూస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని