USA: ఐరోపాకు అమెరికా వెన్నుపోటు..!

ఐరోపాలోని మిత్రదేశాలను అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన శీతాకాలంలో వాటికి అత్యవసరమైన గ్యాస్‌ సరఫరా వ్యవస్థను అమెరికా ఓ కోవర్ట్‌ ఆపరేషన్‌లో ధ్వంసం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. 

Updated : 10 Feb 2023 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

శీతాకాలం ఐరోపా ఖండానికి చమురు, గ్యాస్‌ ప్రాణవాయువుతో సమానం. అలాంటి ప్రాణవాయువును ఐరోపాలోని మిత్రదేశాలకు అందకుండా అమెరికా(USA)నే కుట్రపన్నిందా..? రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి కోవర్టు ఆపరేషన్‌ నిర్వహించిందా..? ప్రపంచం దృష్టి మళ్లించి అమెరికా నౌకాదళంలోని రహస్య డైవర్లు ఓ గ్యాస్‌పైపులైన్‌ను బద్దలు కొట్టారా..? దీనికి జోబైడెన్‌ (joe biden)నేరుగా ఆదేశాలు జారీ చేశారా..? ఈ ప్రశ్నలకు ప్రముఖ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు సిమౌర్‌ హెర్ష్‌ సమాధానం ఇచ్చారు. తాజాగా ఐరాపాలో జర్మనీ వంటి దేశాలకు కీలకమైన నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైపులైన్‌ను అమెరికా ఓ కోవర్ట్‌ ఆపరేషన్‌లో పేల్చేసిందని ఆయన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్టాక్‌లో పరిశోధనాత్మక కథనం ప్రచురించారు.

హెర్ష్‌ రిపోర్ట్‌ అంటే అమెరికా(USA)కు భయం..?

హెర్ష్‌ సాధారణ జర్నలిస్టు కాదు.. అతడు 1968లో వియత్నాం యుద్ధంలో అమెరికా(USA) సైన్యం దాదాపు 500 మందికిపైగా నిరాయుధులైన ప్రజలను చంపిన ‘మీ లై’ నరమేధాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు.. 2004లో ఇరాక్‌లో అబు గ్రైబ్‌ జైల్లో అమెరికా సైన్యం అరాచకాన్ని బయటపెట్టాడు. ఈ రెండు సార్లు ఆ నివేదికలు తప్పు అని అమెరికా బుకాయించింది. కానీ, చివరికి అవి వాస్తవమని తేలాయి. గతంలో వాటర్‌గేట్‌  కుంభకోణాన్ని కూడా హెర్ష్‌ కవర్‌ చేశాడు. హెర్ష్‌ పాత్రికేయంలో అత్యంత  ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్‌ అవార్డు(1970)ను అందుకొన్నాడు. తాజాగా హెర్ష్‌ నివేదికతో అమెరికా - రష్యా మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

నౌకాదళ విన్యాసాల ముసుగులో బాంబులు అమర్చి..

2021 డిసెంబర్‌లో రష్యా దళాలు ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్దకు చేరడం మొదలైంది. దీంతో ఉక్రెయిన్‌పై దాడి ఖాయమని తేలిపోయింది. ఈ సమయంలో అమెరికా(USA) సీఐఏ, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌, ఖజానా శాఖ అధిపతులతో కొత్తగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌తో అధ్యక్షుడు జోబైడెన్‌(joe biden) సమావేశమయ్యారు. నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నుంచి చౌక గ్యాస్‌పై జర్మనీ, పశ్చిమ ఐరోపా ఆధారపడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రెమ్లిన్‌కు అందే గ్యాస్‌ డబ్బుతో ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని భయపడ్డారు. దీంతో నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను పేల్చివేయాలని నిర్ణయించారు. దీనిని పేల్చివేయడానికి ప్లాన్‌ సిద్ధం చేయాలని బైడెన్‌(joe biden) సూచన మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులేవాన్‌ సైనిక అధికారులను ఆదేశించారు.

ఈ మొత్తం ఆపరేషన్‌ కోసం అమెరికా(USA) నిఘా సంస్థలు నార్వే సాయం తీసుకొన్నాయి. పైపులైన్‌ పేల్చివేయడానికి అనువైన ప్రాంతాలను నార్వే నౌకాదళం గుర్తించి అమెరికాకు తెలియజేసింది. అమెరికా నౌకాదళానికి ఫ్లొరిడా రాష్ట్రంలోని పనామాలో అతిపెద్ద డైవింగ్‌ అండ్‌ సాల్వేజ్‌  కేంద్రం ఉంది. ఇక్కడ సముద్రంలో అత్యంత లోతుల్లోకి వెళ్లే డైవర్లు ఉన్నారు. వీరిని రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఇక వేసవిలో నాటో దళాలు బాల్టిక్‌ సముద్రంలో నిర్వహించే ‘బాల్టాప్స్‌22’ యుద్ధ విన్యాసాల ముసుగులో ఈ డైవర్ల సాయంతో గ్యాస్‌ పైప్‌లైన్‌ వద్దకు సీ4 అనే పేలుడు పదార్థాలను చేర్చారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 26వ తేదీన అమెరికా పీ8 నిఘా విమానం ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ప్రత్యేక సోనార్లను జారవిడిచింది. అవి విడుదల చేసిన సంకేతాలతో సీ4లు పేలి పైపులైన్లు ధ్వంసమైనట్లు హెర్ష్‌ కథనంలో పేర్కొన్నాడు.  నార్డ్‌స్ట్రీమ్‌ 1,2 పైపులైన్ల వద్ద మూడు చోట్ల లీకులు ఏర్పడ్డాయి. రష్యానే అప్పట్లో ఈ పేలుడుకు పాల్పడిందని అమెరికా, నాటో ఆరోపణలు గుప్పించాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నాయి.

ఇక ఐరోపా దేశాలకు రష్యా గ్యాస్‌ సరఫరా గణనీయంగా పడిపోయింది. ఆ దేశాలు అమెరికా(USA), అజర్‌బైజన్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకొని శీతాకాలాన్ని నెట్టుకొచ్చాయి.

ఏమిటీ నార్డ్‌స్ట్రీమ్‌ పైపులైన్‌..!

రష్యాలో భారీ ఎత్తున సహజవాయు క్షేత్రాలు ఉన్నాయి. ఫలితంగా అత్యధికంగా, చౌకగా గ్యాస్‌ ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఉంది. ఇక్కడి నుంచి చౌకగా గ్యాస్‌ను జర్మనీకి సరఫరా చేయడానికి 1,224 కిమీ పొడవునా బాల్టిక్‌ సముద్రంలో నార్డ్‌స్ట్రీమ్‌1 పైపులైన్‌ నిర్మించారు. రష్యాకు చెందిన గ్యాజ్‌ప్రోమ్‌ మరో నాలుగు ఐరోపా సంస్థలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. జర్మనీకి దీని నుంచి అత్యధికంగా గ్యాస్‌ వెళ్లేది. ఈ ప్రాజెక్టును విస్తరిస్తూ 2015లో నార్డ్‌స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌  ఏర్పాటు చేయనున్నట్లు రష్యాకు చెందిన గ్యాజ్‌ప్రోమ్‌, మరికొన్ని ఐరోపా సంస్థలు ప్రకటించాయి. దీనిని అమెరికా(USA), యూకే, ఉక్రెయిన్‌, ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు వ్యతిరేకించాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాస్కోకు ఐరోపా సమాఖ్యపై పట్టు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, 2021 సెప్టెంబర్‌లో నిర్మాణం పూర్తయింది. దీనికి జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రాకపోవడంతో పక్కనపెట్టారు. ఈ పైప్‌లైన్‌ నిర్మాణానికి 11 బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించారు. 

అవి తప్పుడు ఆరోపణలు..: అమెరికా

నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను అమెరికా(USA) పేల్చివేసిందని వచ్చిన ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది. అవి శుద్ధ అబద్ధాలని, పూర్తిగా కల్పితాలని పేర్కొంది. అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, విదేశాంగ శాఖలు కూడా ఇలాంటి సమాధానాలే చెప్పాయి.  పైప్‌లైన్‌ పేలుళ్లు జరిగిన ప్రదేశాలకు సమీపంలోని స్వీడన్‌, డెన్మార్క్‌ దేశాలు మాత్రం ఎవరిపేరు ప్రస్తావించలేదు.. కానీ, ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అని మాత్రం పేర్కొన్నాయి.  ఇక ఈ కథనంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ కుట్ర వెనుక ఉన్న వారు పరిణామాలు అనుభవిస్తారని పేర్కొంది. స్వీడన్‌, డెన్మార్క్‌లు తమ విచారణకు సహకరించాలని కోరింది. కానీ.. అవి నిరాకరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని