Anand Mahindra: గడ్కరీ జీ.. మనం ఇలా ప్లాన్‌ చేయొచ్చా?

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ట్విటర్‌లో ఇరువైపులా ఎత్తైన వృక్షాలతో...

Published : 27 Aug 2022 21:51 IST

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ట్విటర్‌లో.. ఇరువైపులా ఎత్తైన చెట్లతో సొరంగం(Tunnel)లా ఆకట్టుకునేలా ఉన్న ఓ రోడ్డు వీడియోపై స్పందించారు. కొత్తగా నిర్మిస్తోన్న గ్రామీణ రహదారుల వెంబడి ఈ తరహా ట్రీ టన్నెల్స్‌ ఏర్పాటుకు మనం ప్లాన్‌ చేయొచ్చా? అంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari)కి ట్యాగ్‌ చేశారు.

‘నాకు సొరంగ మార్గాలంటే ఇష్టం. ఇలా వృక్షాలతో ఏర్పడిన టన్నెళ్లగుండా వెళ్లడానికి ఇష్టపడతా. నితిన్ గడ్కరీ జీ.. మీరు నిర్మిస్తోన్న కొత్త గ్రామీణ రహదారుల వెంబడి ఇలా వృక్షాలతో టన్నెళ్ల ఏర్పాటుకు మనం ప్లాన్ చేయొచ్చా?’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే, సంబంధిత రోడ్డు వీడియో ఎక్కడ తీశారో ట్వీట్‌లో పేర్కొనలేదు. మరోవైపు.. ఆనంద్‌ మహీంద్రా స్పందన కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

నెటిజన్లు సైతం దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఈ తరహా రోడ్డు మార్గాల ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. భారత్.. అనేక అందమైన ప్రదేశాల సమాహారమని కామెంట్లు పెడుతున్నారు. డెహ్రాడూన్‌, పౌంటా సాహెబ్‌ మార్గంలో ఇలాంటిదే ఓ రోడ్డు ఉందంటూ ఓ వ్యక్తి పోస్ట్‌ చేసిన ఫొటోపై ఆనంద్‌ మహీంద్రా ‘వావ్‌’ అంటూ స్పందించారు. మరికొన్ని చిత్రాలకూ ఆయన రిప్లై ఇచ్చారు. మరి నితిన్‌ గడ్కరీ ఏమంటారో వేచి చూడాల్సి ఉంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని