‘బ్లాక్‌ ఫంగస్‌’ మందుల కొనుగోలుకు యత్నాలు

బ్లాక్‌ ఫంగస్‌ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన ఇంజక్షన్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి తక్షణం అవసరమైన యాంపోటెరిసిన్‌-బి

Updated : 20 May 2021 06:55 IST

 యాంపోటెరిసిన్‌ ఇంజక్షన్ల కోసం కసరత్తు
 మందులు దొరక్క బాధితుల ఆవేదన

ఈనాడు-అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన ఇంజక్షన్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి తక్షణం అవసరమైన యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు మార్కెట్‌లో లభించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా కలత చెందుతున్నాయి. కొందరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంత ధరైనా చెల్లించి కొనేందుకు సిద్ధపడుతున్నా అవి లభించడం లేదు. అయితే యాంపోటెరిసిన్‌-బి 50ఎంజీ, 100 ఎంజీ ఇంజక్షన్లను 10వేలు చొప్పున కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం సూచించిన రెండు సంస్థలతో ఇప్పటికే ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ చర్చలు జరిపింది. అదనంగా మరో కంపెనీతో కూడా మాట్లాడుతోంది. బ్లాక్‌ ఫంగస్‌ బారినపడిన రోగికి కనీసం 60 నుంచి 90 వరకు ఈ ఇంజక్షన్లను వాడాల్సి రావచ్చని చెబుతున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ.5,900 నుంచి రూ.6,200 మధ్య ఉండవచ్చని తెలిసింది. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించింది. మరో వారంలో కొన్ని మందులు రాష్ట్రానికి రావచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వం ద్వారానే ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి కూడా వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే ఇంజక్షన్ల సరఫరా జరిగేలా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొవిడ్‌ బాధితుల్లో ఆరోగ్యం విషమించిన వారికి టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ ప్రస్తుతం ఏ విధంగా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్‌ ఆసుపత్రులకు సరఫరా జరుగుతుందో..అదే విధానాన్ని యాంపోటెరిస్‌-బి ఇంజక్షన్ల విషయంలోనూ అనుసరించాలని భావిస్తున్నారు. బాధితుల్లో అవసరమైన వారికి టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలంటే సంబంధిత ఆసుపత్రి వైద్య నిపుణులు సిఫార్సు చేయాలి. దీనిని సంబంధిత జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ ఆమోదిస్తేనే ఈ ఇంజక్షన్‌ రోగికి చేరుతుంది. అన్ని ఖర్చులు కలుపుకొని నిర్ధారించే ధరకు అనుగుణంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు చెల్లించాలి.
పెరుగుతోన్న కేసులు...
బ్లాక్‌ ఫంగస్‌ బారినపడిన వారు క్రమంగా రాష్ట్రంలో పెరుగుతున్నారు. కృష్ణా జిల్లాలోనే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కలిపి అధికారికంగా సుమారు 20 అనుమానిత కేసులు ఉన్నట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే విధంగా ఈ కేసులు బయటపడుతున్నాయి. అయితే ఈ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో లేనందున బాధితుల కుటుంబాలు వాటి కోసం అవస్థలు పడుతున్నాయి. ఇవి హైదరాబాదులోనూ దొరకడం కష్టంగా ఉంది.


 

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘బ్లాక్‌ ఫంగస్‌’ చికిత్స
          తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు          

ఈనాడు-అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడే వారికి అందించే చికిత్సను ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తెస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పోస్ట్‌-కొవిడ్‌ కింద అందించే ఈ చికిత్సను 14 రోజులపాటు ఆసుపత్రిలో ఉండి సిటీ, ఎమ్మారై, ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి వస్తే రూ.41,968 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ కోసం రూ.16,932 ఇస్తుంది. కంటికి సంబంధించిన మూడు రకాల శస్త్రచికిత్సలను అవసరాల మేరకు చేయాల్సి వస్తుంది. శస్త్రచికిత్స స్థాయి అనుసరించి రూ.27,810నుంచి  రూ.50,000 మధ్య చెల్లింపులు ఉంటాయి. యాంపోటెరిసివ్‌-బి ఇంజక్షన్లను వాడితే వాటి బిల్లులను సమర్పిస్తే ఎంఆర్‌పీ ధర మేరకు చెల్లింపులు ఉంటాయి. ఇంజక్షన్ల ఫొటోలు, బార్‌కోడ్‌తో ఉన్న వయల్స్‌ను ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లులతోపాటు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌కు 13 బోధనాసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. వైద్య నిపుణులు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వైద్యం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని