పోతేపోనీ నీళ్లు.. వస్తేరానీ కన్నీళ్లు!

సాగు, తాగు నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. నోరువిప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గళం వినిపించిందీ లేదు. రాష్ట్రానికి నష్టం కలిగించే కృష్ణా జల వివాదాలపై ట్రైబ్యునల్‌కు అదనపు అంశాలు పరిశీలించే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది.

Updated : 21 Nov 2023 06:39 IST
కృష్ణా, గోదావరి జల వివాదాల పరిష్కారంలో సీఎం జగన్‌ తీరిది..
కేంద్రాన్ని నిలదీయలేని దుస్థితి  
నామమాత్రపు లేఖలతో సరి

వస్తేరానీ కష్టాలు, నష్టాలు
రాష్ట్రానికి కదా ఆ శాపాలు
పోతేపోనీ కృష్ణా, గోదావరి నీళ్లు
ప్రాజెక్టులు నిర్మిస్తే కదా అవసరమయ్యేది నీళ్లు..
ఆయకట్టు బీడుగా మారితే కర్షకులకు కదా కన్నీళ్లు
దిల్లీ పెద్దలతో ఎందుకు  గొడవలు?
పోగొట్టుకుంటామా సొంత ప్రయోజనాలు ?
-ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగున్నర ఏళ్లుగా పరిపాలన సాగిస్తున్న వై.ఎస్‌.జగన్‌ తీరిది..
సాగు, తాగు నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. నోరువిప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గళం వినిపించిందీ లేదు. రాష్ట్రానికి నష్టం కలిగించే కృష్ణా జల వివాదాలపై ట్రైబ్యునల్‌కు అదనపు అంశాలు పరిశీలించే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. మరోవైపు గోదావరి జల వివాదాలు పరిష్కరించాలని, కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలనే ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ను ఇంతవరకు పట్టించుకోలేదు.
2020 అక్టోబరు 6న దిల్లీలో అపెక్సు కౌన్సిల్‌ (సర్వోన్నత మండలి) సమావేశం కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ అధ్యక్షతన నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కృష్ణా నదిపై అదనపు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటే ట్రైబ్యునల్‌పై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దీనికి తన అసమ్మతి తెలియజేయకపోవడం కొంపముంచింది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని అదే అపెక్సు కౌన్సిల్‌ సమావేశంలో సీఎం జగన్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రం సైతం అంగీకరించింది. ఇంతవరకు ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై నిర్ణయాన్ని కేంద్రం తీసుకోలేదు.

ఎందుకీ గోదావరి ట్రైబ్యునల్‌ ?

  • 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంపకాలకు సంబంధించి వివాదం తలెత్తితే సెక్షన్‌ 84 (3) కింద కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయవచ్చు. 1980లో గోదావరి జల పంపిణీ అవార్డు తీసుకొచ్చారు. 1975 నుంచి 1980 వరకు వివిధ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలనే గోదావరి అవార్డుగా అమలు చేస్తున్నారు. 1978 ఆగస్టు 7న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లు కుదుర్చుకున్న ఒప్పందం మినహా మిగిలిన ఒప్పందాలన్నీ గోదావరి అవార్డు ప్రకారం అమలులో ఉన్నాయి.
  • రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరిలో నిర్దిష్టంగా నీటి కేటాయింపులు ప్రత్యేకంగా లేవు. వ్యాప్కోస్‌ అధ్యయనం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి అన్నీ కలిపి 75 శాతం విశ్వసనీయ జలాలు 1,430 టీఎంసీలు ఉన్నట్లు లెక్కించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టుల కింద వినియోగంలో ఉన్న నీరు  659.691 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నీరు 116.20 టీఎంసీలు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వినియోగం 471.686 టీంఎసీలు, కొత్త ప్రాజెక్టులకు అవసరమైనది 178.116 టీఎంసీలు.
  • ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నీరు ఉమ్మడి రాష్ట్రానికి లేనట్లే. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం గోదావరి అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టులు నిర్మిస్తుండటంతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలుగుతోంది.
  • ఈ నేపథ్యంలోనే కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు అవసరం అని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం 450 టీఎంసీల వినియోగంతో ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తుండగా తర్వాత ఆ వినియోగాన్ని ఏకంగా 714 టీఎంసీలకు పెంచిందని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల దిగువన ఉన్న రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది.
  • నీరు ఎంత అందుబాటులో ఉందో తేల్చి ప్రాజెక్టుల వారీగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించడంతో పాటు తక్కువగా నీరు ఉన్నప్పుడు ప్రాధాన్యాలు తేల్చేలా ప్రొటోకాల్‌ను కూడా ట్రైబ్యునల్‌ నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందుకు గోదావరిపై కొత్త ట్రైబ్యునల్‌ను కోరుకుంటున్నా కేంద్రం కనికరించడం లేదు.
ఈనాడు, అమరావతి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని