Aarogyasri: 29 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిపివేస్తాం

రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో జాప్యాన్ని, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) వెల్లడించింది.

Updated : 27 Dec 2023 10:50 IST

ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్‌ హెచ్చరిక
ఫీజుల చెల్లింపుల్లో జాప్యం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం

ఈనాడు, అమరావతి: రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో జాప్యాన్ని, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ (Aarogyasri) ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) వెల్లడించింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద కూడా వైద్య సేవలు అందించలేమని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది జూన్‌, నవంబరు మాసాల్లో సేవలు నిలిపివేస్తామని  ఆశా ప్రకటించిన తరవాత చర్చలు జరిపి ఈ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయి. గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేనందున ఈ నెల 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఈ మేరకు లేఖను 22వ తేదీన ప్రభుత్వానికి అందజేశాం’ అని ఆశా ప్రకటించింది

రూ.1,000 కోట్ల బకాయిలు

‘ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంతో నవంబరులో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబరు నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచలేదు. పెంపు కోసం అసోసియేషన్‌ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా రూ.25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచింది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద నిర్ణయించిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10శాతం తగ్గించారు. 70శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదు. మిగిలిన ప్యాకేజీల ధరల పెంపు 2.5 శాతం మేర పెరిగింది. ఈ చర్యలతో ఆసుపత్రులకు ఆర్థికంగా జరిగిన ప్రయోజనం శూన్యం. ఈ పరిస్థితుల్లో వైద్య సేవల నిలిపివేత నిర్ణయం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో..ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో తీసుకున్నది కాదు.  గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కేసులను చూడకూడదు అని నిర్ణయించాం’ అని ఆశా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని