icon icon icon
icon icon icon

ఏపీలో చంద్రబాబు.. కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్‌షా

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా అన్నారు.

Updated : 05 May 2024 15:34 IST

ధర్మవరం: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా(TDP), జనసేన (Janasena)తో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా(BJP) అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.  తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమిత్‌షాకు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత అమిత్‌షా కూడా చంద్రబాబును శాలువాతో సత్కరించారు.

అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే కూటమి..

‘‘ఆంధ్రాలో భూ మాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డాం. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడతాం. తెలుగు భాషను రక్షిస్తాం. జగన్‌ రెడ్డీ గుర్తుంచుకో.. భాజపా ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వం. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయహోదా ఇవ్వడంలో భాజపా కీలకపాత్ర పోషించింది. జగన్‌ అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుంది. 

చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలి

మూడోసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే. దేశాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు ఆయన్ను మళ్లీ ప్రధానిని చేయాలి. ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారు. విభజన తర్వాత కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్లారు. ఆయన చేసిన అభివృద్ధిని జగన్‌ అధోగతి పట్టించారు. మద్య నిషేధం చేస్తానని ఇచ్చిన మాట తప్పారు. మద్య నిషేధం చేయకపోగా.. సిండికేట్‌కు తెరలేపారు. ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు, మోదీని గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లతో చంద్రబాబును సీఎంను చేయాలి’’ అని అమిత్‌షా పిలుపునిచ్చారు. 

ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?

ఈ సందర్భంగా ‘ఇండియా’ కూటమిపై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌, రాహుల్‌ గాంధీ.. వీరిలో ఎవరిని చేస్తారో చెప్పాలన్నారు. ఆ కూటమిలో ప్రధాని అభ్యర్థే లేరని ఎద్దేవా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img