పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు

పోలింగ్‌కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్‌’ నిధులు గుమ్మరిస్తోంది.

Published : 05 May 2024 06:56 IST

ఒకేరోజు రూ.400 కోట్ల ‘మెటీరియల్‌’ బిల్లుల చెల్లింపు
రేపటిలోగా మరో రూ.800 కోట్ల జమ
ఎన్నికల్లో పంపిణీకి వైకాపా సర్పంచులకు సొమ్ముల గుమ్మరింత
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్థికశాఖ అధికారుల అత్యుత్సాహం

ఈనాడు- అమరావతి: పోలింగ్‌కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్‌’ నిధులు గుమ్మరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తడవుగా... శనివారం ఒకే రోజు రూ.400 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. మరో రెండు రోజుల్లో ఇంకో రూ.800 కోట్ల బిల్లులు ఇవ్వనుంది. గ్రామాల్లో ఓటర్లకు వైకాపా తరఫున డబ్బు పంపిణీ చేసేందుకు సర్పంచులకు నిధులు సమకూర్చేందుకే ప్రభుత్వం హడావుడిగా పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోకుండానే.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బిల్లులు చెల్లింపులపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్థికశాఖల అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. ముగ్గురు ఉన్నతాధికారులతో వేసిన కమిటీ అనుమతి కూడా లేకుండానే బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మెటీరియల్‌ పనులు నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి గత ఏడాది నవంబరు నుంచి రూ.1,200 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధిక పంచాయతీల్లో వైకాపావారే సర్పంచులు. ఎన్నికల్లో పార్టీ కోసం నాలుగు రూపాయలు ఖర్చు చేయాలంటే పెండింగ్‌ బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేయాలని పలువురు సర్పంచులు ఇటీవల ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు విడుదల చేసేలా చూడాలన్న ‘పెద్దల’ ఆదేశాలతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు కొద్ది రోజుల క్రితం దిల్లీకి కూడా వెళ్లారు. రెండు రోజుల క్రితం పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు కేంద్రం రూ.1,200 కోట్ల వరకు విడుదల చేసింది.

ఎన్నికల ముందు ప్రేమ!

మెటీరియల్‌ పనుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో గతంలో ఎప్పుడూ కనబరచని ఉత్సాహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్థికశాఖలు ప్రస్తుతం చూపిస్తున్నాయి. బిల్లులకు సంబంధించి సెకండ్‌ సిగ్నేచర్‌తో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు (ఎఫ్‌టీవో) తక్షణమే అప్‌లోడ్‌ చేయాలని జిల్లా అధికారులకు గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లడం, శనివారం సాయంత్రానికి ఆర్థికశాఖ రూ.400 కోట్లకు పైగా బిల్లులు చెల్లించడం చకచకా జరిగిపోయాయి. ఎఫ్‌టీవోలు అప్‌లోడ్‌ చేసిన మిగతా బిల్లులు కూడా సోమవారంలోగా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెటీరియల్‌ పనుల పెండింగ్‌ బిల్లుల చెల్ల్లింపుల్లో ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంత శ్రద్ధ చూపలేదు. కేంద్రం నిధులిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడుకుని ఎప్పుడో చెల్లించేవారు. దీనిపై వైకాపా సర్పంచులు సైతం ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు కూడా సరిగా విడుదల చేయకుండా విద్యుత్తు ఛార్జీలకు మళ్లించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన రూ.998 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. రాష్ట్ర ఆర్థికశాఖకు కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారం 14 రోజుల్లోగా పంచాయతీ బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. జాప్యంపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆర్థికశాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు (బీఆర్వోలు) ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇప్పటికీ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ‘మెటీరియల్‌’ పనుల నిధుల విషయంలో మాత్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఈ పనులు చేయించిన వారిలో వైకాపా సర్పంచులతోపాటు ఆ పార్టీ గ్రామ స్థాయి నాయకులు ఉండటమే దీనికి కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని