నెల‌కు రూ.1.5 ల‌క్ష‌ల ఆదాయం కోసం ప్ర‌ణాళిక‌

20 సంవత్సరాల పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రూ.50 లక్షల మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి

Updated : 17 Jul 2021 18:03 IST

ఇంటర్నెట్‌డెస్క్: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబ‌డి ఉంటాయి. కానీ, పెట్టుబడిదారుడు దీర్ఘ‌కాలం కొన‌సాగితే ఈ రిస్క్‌ త‌గ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్, వంటి డెట్ ప‌థ‌కాలు దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. పెట్టుబడి దీర్ఘకాలికంగా అంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవ‌డం మంచిది. ఈ వ్య‌వ‌ధిలో 10-12 శాతం వార్షిక రాబడిని ఆశించ‌వ‌చ్చు. ఇది పెట్టుబడి కాలంలో ద్రవ్యోల్బణ రేటును అధిగమించడానికి సరిపోతుంది. వచ్చే 20 ఏళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి,  ఆ త‌ర్వాత కాలంలో డ‌బ్బు ఉండ‌టం చాలా ముఖ్యం. కాబట్టి, ఇప్పుడు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న‌ వ్యక్తి 40 ఏళ్ళకు చేరుకున్నప్పుడు పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయాన్ని ఎలా సృష్టించాలో ప్రణాళిక వేసుకోవాలి.

40 ఏళ్లు చేరుకోబోయే వారికి పదవీ విరమణానంతర జీవిత ప్రణాళిక కోసం, ద్రవ్యోల్బణ పెరుగుదలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్ర‌స్తుతం ఒక మధ్యతరగతి వ్యక్తికి నెలకు రూ. 40,000 అవసరం. పదవీ విరమణ తరువాత ఆర్థిక అవసరాల కోసం ద్ర‌వ్యోల్బ‌ణాన్ని 6-7 శాతం అంచ‌నా వేస్తే అది రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు పెరుగుతుంది. కాబట్టి, ఒక వ్య‌క్తి ఆర్థిక అవసరాలకు 20 సంవత్సరాల తరువాత నెలకు రూ.1.25 లక్షల నుంచి రూ. 1.50 లక్షలు అవసరం అవుతుంది. పదవీ విరమణ తరువాత లేదా 20 సంవత్సరాల తరువాత ఈ ఆర్థిక అవసరాల కోసం ఎందులో, ఎంత మొత్తం పెట్టుబ‌డి పెట్టాలంటే..మీరు ఈ 20 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధితో మొత్తం 50 ల‌క్ష‌లు పెట్టుబడి అనుకుంటే నెల‌కు 10-12 శాతం రాబ‌డి అంచ‌నా వేసుకోవాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి, త‌క్కువ రిస్క్ ఉన్న పెట్టుబ‌డులు చేసిన‌వారికి రూ.3.6 కోట్ల వ‌ర‌కు స‌మ‌కూరుతాయి. అదే కొంత రిస్క్ తీసుకునే పెట్టుబ‌డిదారుడికి అయితే రూ.5.3 కోట్ల వ‌ర‌కు ఆశించ‌వ‌చ్చు. ఇందులో 4 శాతం వార్షిక ఉప‌సంహ‌ర‌ణ రేటును అనుకుంటే నెల‌కు రూ.1.2 ల‌క్ష‌ల నుంచి 1.7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు.

ఇక పోర్ట్‌ఫోలియో స‌మ‌తుల్యం చేసిన త‌ర్వాత అది స‌గ‌టున‌ రూ.1.5 ల‌క్ష‌లు అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రూ.50 లక్షల మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టాలి, త‌ర్వాత‌ ఇది 20 సంవత్సరాల దీర్ఘకాలిక పెట్టుబడిదారుడికి 10-12 శాతం రాబడిని అందిస్తుంది. 20 సంవత్సరాల తరువాత ఒక వ్య‌క్తి రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.5 లక్షల నెలవారీ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంప్రదాయ‌క‌ పెట్టుబడిదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్, ఐసీఐసీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ మంచి ఎంపిక. కొంత రిస్క్ సామ‌ర్థ్యం ఎక్కువ ఉన్న‌ పెట్టుబడిదారుడు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ అడ్వాంటేజ్, ఎస్‌బీఐ ఫ్లెక్సీ క్యాప్‌లో తగిన పెట్టుబడిని ప‌రిశీలించ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని