SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా.. EMI ఇక మరింత ప్రియం

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో ఏదైనా కొని.. దానికి ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజుల్లో ఈ చెల్లింపులు మరింత భారం కానున్నాయి. డిసెంబరు 1

Published : 14 Nov 2021 01:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో ఏదైనా కొని.. దానికి ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజుల్లో ఈ చెల్లింపులు మరింత భారం కానున్నాయి. డిసెంబరు 1 నుంచి క్రెడిట్‌ కార్డు ఈఎంఐలపై రూ.99(ట్యాక్సులు అదనం) ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ మేరకు క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు ఈ-మెయిల్‌ సందేశం పంపింది.

‘‘డిసెంబరు 1, 2021 నుంచి మర్చెంట్ ఈఎంఐ లావాదేవీలపై రూ.99(+ పన్నులు) ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనున్నాం. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా అన్ని మర్చంట్‌ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, యాప్‌లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుంది’’ అని ఎస్‌బీఐ వెల్లడించింది. అంటే.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్‌ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది.

ఉదాహరణకు.. మీరు ఒక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో మొబైల్‌ ఫోన్‌ కొని దానికి ఈఎంఐ ఆప్షన్‌ పెట్టుకున్నారనుకోండి.. ఆ చెల్లింపులను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో చేస్తే మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ.99 ప్లస్‌ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు మీ క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌లో ఈఎంఐ అమౌంట్‌తో కలిపి కన్పిస్తుంది. ఈఎంఐగా మార్చుకునే లావాదేవీలకు మాత్రమే ఈ ఫీజును ఛార్జ్‌ చేస్తారు. అయితే ఈఎంఐ లావాదేవీ రద్దయితే ఈ ఫీజును తిరిగి ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

అయితే ఈ ప్రాసెసింగ్‌ ఫీజుకు.. కార్డు ఇంట్రెస్ట్‌ ఛార్జీలకు ఎలాంటి సంబంధం లేదు. కొన్ని సార్లు ఈఎంఐలకు మార్చుకున్నప్పుడు విక్రయదారులు వడ్డీలపై డిస్కౌంట్లు కల్పిస్తారు. జీరో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంటుంది. అలాంటి వాటికి కూడా ఈ ప్రాసెసింగ్‌ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని