విద్యావేత్త‌ల‌కు స్టాక్ ఆప్షన్స్ - అన్అకాడ‌మీ సరికొత్త ప్రయోగం

విద్యావేత్త‌ల‌కు స్టాక్స్‌తో ప‌ట్టం క‌డుతున్న అన్అకాడ‌మీ

Updated : 31 Jul 2021 16:27 IST

విద్యార్థుల‌కు, ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారికి ఆన్‌లైన్‌లో పాఠాల‌ను చెప్తూ స‌రికొత్త ఒర‌వ‌డిని సృష్టించిన సంస్థ అన్అకాడ‌మీ మ‌రో కొత్త ఆలోచ‌న‌తో ముందుకొచ్చింది. త‌మ వ‌ద్ద ప‌నిచేసే విద్యావేత్త‌ల‌కు, ట్యూట‌ర్ల‌కు స్టాక్ ఆప్ష‌న్ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపింది.

విద్యా విభాగంలో అన్అకాడ‌మీ స‌రికొత్త అడుగు వేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అధ్యాపకులకు చెప్పుకోద‌గ్గ వేత‌నాలు ఉండ‌టంలేద‌నే అభిప్రాయం ఉన్న నేప‌థ్యంలో ఇది మంచి నిర్ణ‌యంగా భావిస్తున్నారు.

సాధార‌ణంగా అంకుర సంస్థ‌లు, కార్పొరేట్ కంపెనీలు త‌మ‌ ఉద్యోగుల‌కు స్టాక్ ఆప్షన్ల‌ను అందిస్తాయి. కానీ, తాత్కాలిక‌ ఉద్యోగుల‌కు కూడా స్టాక్ ఆప్ష‌న్ల‌ను ఇస్తోన్న మొద‌టి సంస్థ అన్అకాడ‌మీ. మా వ‌ద్ద ప‌నిచేసే అధ్యాపకుల, విద్యావేత్త‌ల కార‌ణంగానే ఆన్‌లైన్‌లో నిల‌దొక్కుకున్నామ‌ని చెప్పే సంస్థ, త‌మ ఉద్యోగుల ఆర్థిక వృద్ధి మా సంస్థ విస్త‌ర‌ణ‌కు తోడ్ప‌డుతుంద‌ని ఆశిస్తోంది.

గ‌త సంవ‌త్స‌ర‌మే అన్అకాడ‌మీ యూనికార్న్ జాబితాలో చేరింది. దీనికి సాఫ్ట్‌బ్యాంక్ మ‌ద్ద‌తు ఉంది. త‌మ పోటీదారులైన బైజూస్, వేదాంతు వంటి ఫ్లాట్‌ఫామ్‌ల‌కు త‌మ ఉద్యోగులు ఆక‌ర్షితులు కాకుండా అక్క‌డే కొన‌సాగేందుకు ఇటువంటి ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
టీచర్ స్టాక్ ఆప్షన్స్:
త‌మ వ‌ద్ద కనీసం మూడు సంవత్సరాల నుంచి ప‌నిచేస్తోన్న‌ ట్యూటర్లకు 40 మిలియన్ డాలర్ల ‘టీచర్ స్టాక్ ఆప్షన్స్’ (టీఎస్‌ఓపీలను) అన్‌కాడమీ ప్ర‌క‌టించింది. మూడు, నాలుగు, ఐదు సంవత్సరాల నుంచి సేవ‌లు అందిస్తున్న‌వారికి ఈ స్టాక్స్ ఇవ్వ‌నుంది. ఇప్ప‌టికే 300 మందికి పైగా అధ్యాపకులు దీనికి అర్హులుగా గుర్తించాము, వారికి వెంట‌నే స్టాక్స్‌ను అందిస్తామ‌ని చెప్పింది. రాబోయే సంవ‌త్స‌రాల్లో మొత్తం 40 మిలియ‌న్ల విలువైన స్టాక్స్‌ను ట్యూట‌ర్ల‌కు కేటాయిస్తామ‌ని తెలిపింది.

ఉద్యోగుల‌కు ప్రోత్సాహ‌కం:
అనేక భారతీయ స్టార్టప్‌లకు చెందిన ఉద్యోగులు త‌మ ప్ర‌యోజ‌నాలు, చెల్లింపుల గురించి ఫిర్యాదు చేస్తున్న సమయంలో అన్అకాడ‌మీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. బోస్ట‌న్ నివేదిక‌ ప్రకారం, దేశంలో 200 మిలియన్లకు పైగా తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగాలు కార్మికులకు విస్తృతంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, నిర్దిష్టమైన ప్ర‌యోజ‌నాల‌ను కంపెనీలు అందించ‌లేక‌పోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ భ‌రోసా, సకాలంలో చెల్లింపులు, అభ్యాసం, వ్యక్తిత్వ వికాసం, జీతం పెంపు వంటి విష‌యాల్లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపింది.

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లైన జోమాటో, స్విగ్గీ ఉద్యోగులు కార్మికులకు వేత‌నాలు త‌గ్గిస్తున్న‌ట్లు సంస్థ‌లే ప్ర‌క‌టించాయి. దీంతోపాటు ఇంధ‌న ఖ‌ర్చుల చెల్లింపులో కూడా కోత పెట్టాయి. అదేవిధంగా ఓలా, ఉబెర్ వంటి క్యాబ్-అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లపై డ్రైవర్లు కూడా గతంలో ఆదాయాలు తగ్గించడంపై నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఇప్పుడు అన్అకాడ‌మీ తీసుకున్న నిర్ణ‌యం మంచి వ్యూహాత్మ‌క ప్ర‌ణాళికగా చెప్తున్నారు. ప్ర‌స్తుతం అన్అకాడ‌మీ సివిల్ స‌ర్వీస్ ప‌రిక్ష‌ల‌కు కోర్సుల‌ను, ఇంజ‌నీరింగ్, మెడిక‌ల్ ప్ర‌వేశ ప‌రిక్ష‌ల‌కు శిక్ష‌ణ‌ను ఇస్తోంది. దీంతో పాటు పాఠ‌శాల విధ్యార్ధుల‌కు కూడా పాఠాల‌ను చెప్ప‌డం ఇటీవ‌లే ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని