IPOs: ప్రారంభమైన రెండు కీలక ఐపీఓలు.. పూర్తి వివరాలివే..!

IPO: నేటి నుంచి రెండు కీలక కంపెనీల ఐపీఓలు ప్రారంభమయ్యాయి. ఆర్కిన్‌ కెమికల్‌, ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ పబ్లిక్‌ ఇష్యూలో షేర్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడానికి నేటి నుంచి అవకాశం ఉంది. ఇవి 11న ముగియనున్నాయి.

Updated : 09 Nov 2022 12:25 IST

దిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫైవ్‌ స్టార్ బిజినెస్‌ ఫైనాన్స్‌ ఐపీఓ ఈరోజు ప్రారంభమైంది. ధరల శ్రేణిని రూ.450- 474గా నిర్ణయించింది. రూ.1,960 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి వస్తున్న ఈ కంపెనీ షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ 11న ముగియనుంది. ఈ ఐపీఓలో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, కొటాక్ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, ఎడెల్‌వెస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నొమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఈ ఐపీఓ కీలక వివరాలు..

  • ధర శ్రేణి: రూ.450- 474
  • బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: నవంబరు 16
  • రీఫండ్ల ప్రారంభం: నవంబరు 17
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ: నవంబరు 18
  • లిస్టింగ్‌ తేదీ: నవంబరు 21
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 31 (ఒక లాట్‌)
  • ఒక్కో షేరు ముఖ విలువ: రూ.01

వివిధ వర్గాలకు షేర్ల కేటాయింపు తీరు..

  • అర్హతగల సంస్థాగత మదుపర్ల వాటా: గరిష్ఠంగా 50 శాతం
  • సంస్థాగతేతర మదుపర్ల వాటా: కనిష్ఠంగా 15%
  • చిన్న మదుపర్లు: కనిష్ఠంగా 35%

కంపెనీ వివరాలు..

దక్షిణ భారత్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌కు బలమైన నెట్‌వర్క్‌ ఉంది. ప్రధానంగా ఆస్తుల్ని తనఖా పెట్టుకొని ఇది రుణాలందిస్తుంటుంది. కన్జ్యూమర్‌, వాహన రుణాలే లక్ష్యంగా ఈ సంస్థ 1984లో కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2005లో చిన్న వ్యాపారాలకు రుణాలివ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా పట్టణ, సెమీ- అర్బన్ ప్రాంతాలపై ఇది దృష్టి సారించింది. కంపెనీ వ్యాపారంలో 85శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఉంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 150 జిల్లాల్లో 311 శాఖలు ఉన్నాయి. 6,077 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2018వ ఆర్థిక సంవత్సరంలో 33,157గా ఉన్న క్రియాశీల ఖాతాల సంఖ్య ఈ ఏడాది జూన్‌ నాటికి 2.3 లక్షలకు పెరిగింది.

కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇదీ..

2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 19.49 శాతం పెరిగి రూ.1,256.16 కోట్లకు చేరింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన రూ.358.99 కోట్ల నుంచి రూ.453.54 కోట్లకు చేరింది. కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ 2022 మార్చి 31 నాటికి రూ.5,100 కోట్లకు పెరిగింది. శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, వెరిటాస్‌ ఫైనాన్షియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, హోంఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వంటి సంస్థలతో పోటీపడుతోంది.


ఆర్కియన్‌ కెమికల్‌ కూడా..

సముద్రయాన రంగంలో ఉపయోగించే ప్రత్యేక రసాయనాలు తయారు చేసే ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ సైతం నేటి నుంచే ప్రారంభమైంది. రూ.1,462 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ నవంబరు 11న ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.386-407గా నిర్ణయించారు. రూ.805 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 1.61 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఈ ఐపీఓ కీలక వివరాలు..

  • ధర శ్రేణి: రూ.386-407
  • బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: నవంబరు 16
  • రీఫండ్ల ప్రారంభం: నవంబరు 17
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ: నవంబరు 18
  • లిస్టింగ్‌ తేదీ: నవంబరు 21
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 36 (ఒక లాట్‌)
  • ఒక్కో షేరు ముఖ విలువ: రూ.02

75 శాతం షేర్లను అర్హతగల సంస్థాగత మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 10 శాతం రిటైల్‌ మదుపర్లకు షేర్లను రిజర్వు చేశారు. కనీసం 36 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐపీఓలో సమీకరించిన నిధుల్ని గతంలో జారీ చేసిన నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ రిడెమ్షన్‌కు ఉపయోగించనున్నారు. ఈ కంపెనీ బ్రొమైన్‌, ఇండస్ట్రియల్‌ సాల్ట్‌, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వంటి రసాయనాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సరఫరా చేస్తోంది. రాన్‌ ఆఫ్‌ కచ్‌లో ఉన్న బ్రైన్‌ రిజర్వుల నుంచి వీటిని తయారు చేస్తోంది. గుజరాత్‌లోని హాజీపూర్‌లో దీని తయారీ కేంద్రం ఉంది.

ఆర్కియన్‌ సరఫరా చేస్తున్న బ్రొమైన్‌ను ఔషధ, అగ్రోకెమికల్స్‌, నీటి శుద్ధి, అగ్నిమాపక, నిల్వ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టోరేజీలో వినియోగిస్తున్నారు. ఇండస్ట్రియల్‌ సాల్ట్‌ను పలు రకాల ఇతర రసాయనాలు, సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను ఎరువులు, వైద్య రంగంలో వాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని