వేతనాలు 10.4% పెరగొచ్చు

వచ్చే సంవత్సరంలో (2023) ఆకర్షణీయ పనితీరు నమోదు చేస్తామనే ఆశాభావంతో దేశీయ కార్పొరేట్‌ రంగం ఉందని ఓ సర్వే వెల్లడించింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నట్లు అవి వెల్లడించాయని పేర్కొంది. అంతర్జాతీయ వృత్తి

Updated : 27 Sep 2022 10:13 IST

2023పై భారతీయ కంపెనీల ఆశాభావం: ఎయాన్‌ సర్వే

దిల్లీ: వచ్చే సంవత్సరంలో (2023) ఆకర్షణీయ పనితీరు నమోదు చేస్తామనే ఆశాభావంతో దేశీయ కార్పొరేట్‌ రంగం ఉందని ఓ సర్వే వెల్లడించింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నట్లు అవి వెల్లడించాయని పేర్కొంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్‌ పీఎల్‌సీ ఈ సర్వే నిర్వహించింది. 40 రంగాలకు చెందిన 1,300 కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. అంతర్జాతీయ మాంద్యం భయాలు, దేశీయంగా అధిక ద్రవ్యోల్బణం లాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారత్‌లో వేతనాలు 10.4 శాతం  పెరిగే అవకాశం ఉంది. 2022లో ఇప్పటివరకు వేతనాల్లో నమోదైన 10.6 శాతం వృద్ధి కంటే ఇది తక్కువ. అయితే ఫిబ్రవరిలో అంచనా వేసిన 9.9 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. బలమైన వ్యాపార పనితీరు కనబరుస్తామని కంపెనీల్లో నెలకొన్న నమ్మకానికి, వేతనాల్లో వృద్ధి అంచనానే నిదర్శనమని సర్వే అభిప్రాయపడింది.

2022 తొలి అర్ధభాగంలో వలసల రేటు 20.3 శాతంగా ఉంది. 2021లో ఇది 21 శాతం. అందుకే వేతనాలపై ఒత్తిడి కొనసాగుతోందని.. రాబోయే కొన్ని నెలల పాటు కూడా ఇదే ధోరణి ఉండొచ్చని నివేదిక విశ్లేషించింది.

అత్యధిక వేతన పెంపు ఉండొచ్చన్న రంగాల్లో ప్రతి ఐదింటిలో నాలుగు సాంకేతికతకు సంబంధించినవే. 12.8 శాతం వేతన పెంపుతో ఇ-కామర్స్‌ రంగం మొదటి వరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అంకురాలు (12.7%), హై-టెక్‌/ ఐటీ, ఐటీ ఆధారిత సేవలు (11.3%), ఆర్థిక సేవలు (10.7%) ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని