‘త్రీ ఇన్‌ వన్‌’ పెట్టుబడి...

సమయానుకూలంగా అన్ని రకాలైన షేర్లలో పెట్టుబడి పెట్టి, అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మల్టీక్యాప్‌ పథకాన్ని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది.

Updated : 10 Sep 2021 05:57 IST

మయానుకూలంగా అన్ని రకాలైన షేర్లలో పెట్టుబడి పెట్టి, అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మల్టీక్యాప్‌ పథకాన్ని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. కోటక్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ చివరి తేదీ ఈ నెల 22. కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ ద్వారా కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ మల్టీ క్యాప్‌ 50:25:25 టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. కోటక్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌కు హర్ష ఉపాధ్యాయ, దేవేందర్‌ సింఘాల్‌, అభిషేక్‌ బిసేన్‌, అర్జున్‌ ఖన్నా ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.

మల్టీక్యాప్‌ పథకాలకు చిన్న, పెద్ద, మధ్యస్థాయి కంపెనీలకు చెందిన షేర్లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఫలానా తరగతి (లార్జ్‌ క్యాప్‌ లేదా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌) కి చెందిన షేర్లకు పరిమితం కావాలనే నియమం ఏదీ ఉండదు. అవకాశాలు ఎక్కడ ఆకర్షణీయంగా ఉంటే, అక్కడికి వెళ్లేందుకు ఇటువంటి పథకాల్లో ఫండ్‌ మేనేజర్‌కు సౌలభ్యం ఉంటుంది. మదుపరులు తమ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాలను విడివిడిగా ఎంచుకునే బదులు ఒక మల్టీక్యాప్‌ పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ‘పవర్‌ ఆఫ్‌ ఆల్‌ ద 3 ఇన్‌ వన్‌ ఫండ్‌’ అనేది దీనికి వర్తిస్తుంది.


మధ్యస్థాయి కంపెనీల్లో...

హెచ్‌ఎస్‌బీసీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 20. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం ప్రధానంగా మిడ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లలోనే పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలంలో అధిక లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నిస్తుంది. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 150 టీఆర్‌ఐ సూచీతో హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ పనితీరును పోల్చి చూస్తారు. దీనికి అంకుర్‌ అరోరా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.
హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ కింద పెట్టుబడి పెట్టేందుకు ‘బాటమ్‌-అప్‌’ పద్ధతిలో మిడ్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీలను ఎంచుకోవటంతో పాటు ‘కాన్సెంట్రేటెడ్‌ పోర్ట్‌ఫోలియో’ అంకుర్‌ అరోరా పేర్కొన్నారు. రిస్క్‌ను తగ్గించుకోవటానికి టాప్‌- డౌన్‌ విధానాన్ని అనుసరిస్తామని వివరించారు. హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ ఫోర్ట్‌ఫోలియోలో లార్జ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లు కూడా ఉండవచ్చు. కానీ కనీసం 65 శాతం పెట్టుబడులు మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఉండాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో మిడ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లలో పెట్టుబడి అవకాశాలు అధికంగా ఉన్నట్లు, దీన్ని అందిపుచ్చుకునే లక్ష్యంతో ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చినట్లు హెచ్‌ఎస్‌బీసీ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.


వినియోగం పెరిగితే.. లాభాలు

వినియోగం గణనీయంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విభాగానికి చెందిన కంపెనీలకు అధిక ఆదాయాలు, లాభాలు అర్జించే అవకాశం ఉంటుందనేది నిస్సందేహం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ఉద్దేశంతో యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, యాక్సిస్‌ కన్జంప్షన్‌ ఈటీఎఫ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 13తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. దీపక్‌ అగర్వాల్‌, వీరేష్‌ జోషి దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. నిఫ్టీ ఇండియా కన్జంప్షన్‌ టీఆర్‌ఐ (ఎన్‌ఐసీఐ)తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఎన్‌ఐసీఐలో వినియోగ రంగానికి చెందిన 30 కంపెనీలునున్నాయి. కన్సూమర్‌ గూడ్స్‌, ఆటోమొబైల్‌, టెలీకామ్‌, హెల్త్‌కేర్‌, మీడియా, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఉన్నాయి. యాక్సిస్‌ కన్జంప్షన్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ప్యాసివ్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ కాబట్టి, దీనికి నిర్వహణ ఛార్జీలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గత దశాబ్ద కాలంలో నిఫ్టీ ఇండియా కన్జంప్షన్‌ టీఆర్‌ఐ 16.59 శాతం వార్షిక ప్రతిఫలాన్ని సంపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని