Digital Gold: మీ పెట్టుబడి బంగారం కానూ..!!

ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఆ రోజు కోసం అని కాదు కానీ.. అసలు పసిడిని ఎందుకు కొనాలి? కొనాలి అనుకుంటే ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోన్న డిజిటల్‌ గోల్డ్‌ను ఎలా కొనాలి. భవిష్యత్‌లో అవసరమైనపుడు సులువుగా ఎలా నగదుగా మార్చుకోవాలి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ప్రపంచం మొత్తం మీద భారత్‌లో పసిడికి ఉన్నంత గిరాకీ మరెక్కడా   కనిపించదేమో. మన సంప్రదాయాలు, సంస్కృతి అందుకు ఒక కారణం.

Updated : 29 Oct 2021 12:30 IST

ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఆ రోజు కోసం అని కాదు కానీ.. అసలు పసిడిని ఎందుకు కొనాలి? కొనాలి అనుకుంటే ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోన్న డిజిటల్‌ గోల్డ్‌ను ఎలా కొనాలి. భవిష్యత్‌లో అవసరమైనపుడు సులువుగా ఎలా నగదుగా మార్చుకోవాలి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రపంచం మొత్తం మీద భారత్‌లో పసిడికి ఉన్నంత గిరాకీ మరెక్కడా   కనిపించదేమో. మన సంప్రదాయాలు, సంస్కృతి అందుకు ఒక కారణం. దీనికి తోడు ఇదో భద్రమైన పెట్టుబడి సాధనం కావడం వల్ల కూడా బంగారం ఎపుడూ మెరుస్తూనే ఉంటోంది. అదీ కాక ద్రవ్యోల్బణం 1 శాతం పెరిగిన ప్రతిసారీ.. భారత్‌లో పైడి గిరాకీ 2.6 శాతం మేర పెరుగుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పసిడి మీద   పెట్టుబడికి ఢోకా ఉండదని  విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నో రకాలు..

పసిడికి సంబంధించిన  పెట్టుబడులు పెట్టడానికి మన ముందు చాలా రకాలు ఉన్నాయి. గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌లు, సావరిన్‌  గోల్డ్‌ బాండ్లతో పాటు భౌతికంగా బిస్కెట్లు, నాణేలు, ఆభరణాలు కొని ఇంట్లో పెట్టుకోవడం, బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడమూ చేయొచ్చు. అయితే ఈ మధ్య డిజిటల్‌ రూపంలో పసిడిని కొనడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అంటే థర్డ్‌ పార్టీ లేదా విక్రేత మన బంగారాన్ని భద్రపరచడం అన్నమాట.


ఇలా కొనాలి..

డిజిటల్‌ పసిడిపై దాదాపు ఎటువంటి నియంత్రణపరమైన ఆంక్షలు కానీ నియంత్రణ కానీ లేదనే చెప్పాలి. ఈ సమయంలో మోసాలకూ అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి డిజిటల్‌ పసిడి పెట్టుబడుల విషయంలో కొన్ని అంశాలను మదుపర్లు తప్పక గమనించాలి. పాటించాలి.


 ఎవరిని ఎంచుకోవాలి?

డిజిటల్‌ గోల్డ్‌ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు మనకు సహాయం చేస్తారు. అంటే మనకు బదులుగా మన బంగారాన్ని వాల్ట్‌లో ఉంచుతారన్నమాట. అయితే సర్వీసు ప్రొవైడరును ఎంచుకునే ముందు విశ్వసనీయత ఉందో లేదో చూడాలి. భాగస్వామ్య సంస్థలు, మాతృసంస్థలు, ఆ కంపెనీకి నిధులు ఇస్తున్న సంస్థల పూర్వాపరాలు చూసి సంతృప్తి చెందాకే ముందడుగు వేయాలి. సర్వీసు ప్రొవైడరుకు మనకు మధ్య మధ్యవర్తిత్వ సంస్థలూ ఉంటాయి. పేమెంట్‌ వాలెట్‌ లేదా బ్యాంకులు కూడా పసిడిని మనకు అందిస్తాయి. ఇవి ఆర్‌బీఐ నియంత్రణలో పనిచేసేవి కాబట్టి వినియోగదార్లకు థర్డ్‌పార్టీ ఉత్పత్తిని అందించే ముందు గట్టి పరిశీలన చేస్తాయి. కాబట్టి నమ్మకానికి భరోసా ఉంటుంది. కాబట్టి సర్వీసు ప్రొవైడరుపై విశ్వాసం ఉంటే తప్ప మార్కెట్‌ ఇంటర్మీడియటరీ ద్వారా కొనుగోలు చేయడమే శ్రేయస్కరం.


విదేశాల్లోనూ భద్రపరచుకోవచ్చు

కొంత మంది సర్వీసు ప్రొవైడర్లు మన పసిడిని విదేశాల్లోనూ భద్రపరుస్తారు. భారత్‌లోనే దాచే పసిడిపై కస్టమ్స్‌ సుంకం ఉంటుంది కాబట్టి విదేశాల్లో దాచే పసిడి ధర కొంత తక్కువకూ లభించొచ్చు. మనం రూపాయల్లో ఇస్తే.. సర్వీసు ప్రొవైడరు డాలర్లలో కొని అక్కడే భద్రపరుస్తాడన్నమాట. ఒక వేళ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకుంటే.. దేశీయంగా పసిడిని కొనుగోలు చేసి మనకు డెలివరీ చేస్తారు.


ధరలో తేడాలుంటాయ్‌

ర్వీసు ప్రొవైడరును బట్టి ధరలో కచ్చితంగా తేడాలుంటాయి. 995, 999 స్వచ్ఛత ఆధారంగా అవి ఉంటాయి. కొన్ని సర్వీసు ప్రొవైడర్లకు సొంత రిఫైనింగ్‌ యూనిట్‌ ఉంటే వాళ్లు సొంత వాల్ట్‌లోనే భద్రపరుస్తారు. కాబట్టి తక్కువ ధర ఉండొచ్చు. అయితే చాలా వరకు అందరూ ఒకే స్థాయిలో ధర ఉండేలా చూసుకుంటారు. ఇక డిజిటల్‌ గోల్డ్‌ విషయంలోనూ సాధారణ ఆభరణాల కొనుగోలు, అమ్మక ధరల్లాగానే తేడాలుంటాయి. మీరు కొనుగోలు చేసే సమయంలో విక్రయ ధర, కొనుగోలు ధరకు మధ్య తేడా.. మీరు రీడీఎమ్‌ చేసుకునేటపుడు ఉండొచ్చు.. ఉండకపోవచ్చని గుర్తుపెట్టుకోవాలి. వివిధ సర్వీసు ప్రొవైడర్లను బట్టి ఈ అంతరం(కొనుగోలు, అమ్మక ధర మధ్య తేడా) ఉంటుంది.


 భద్రత ముఖ్యం

మీ బంగారాన్ని భద్రంగా నిల్వ చేయడమూ ముఖ్యమే. సాధారణంగా దొంగతనానికి గురైతే కచ్చితంగా బీమా వర్తిస్తుంటుంది. ఒక వేళ ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ బీమా వర్తిస్తుందో లేదో కనుక్కోండి. అలాగే బంగారాన్ని సొంత వాల్ట్‌లో భద్రపరుస్తున్నారా? లేదా వేరే కంపెనీ వాల్ట్‌లో ఉంచుతున్నారా అన్నదీ తెలుసుకోవాలి.


 విక్రయం ఎలా..

మీ పెట్టుబడులను  బంగారంగా.. బంగారం నుంచి నగదుగా మార్చడానికి ఎంత వ్యయం అవుతుందో ముందే తెలుసుకోవాలి. మీరు రీడీమ్‌ చేసుకోవాలనుకున్నపుడు అయ్యే వ్యయాల గురించి కంపెనీ వెబ్‌సైట్‌లోని  తరచుగా అడిగే ప్రశ్నలను చదివి తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు