దేశీయ ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాల వెల్లువ!

ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు, సర్వీస్‌ ప్రొవైడర్లు అత్యవసరంగా టెక్ నిపుణుల నియామకం కోసం  ఎదురు చూస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో

Published : 13 Jul 2021 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు, సర్వీస్‌ ప్రొవైడర్లు అత్యవసరంగా టెక్ నిపుణుల నియామకం కోసం  ఎదురు చూస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపార సంస్థలు డిజిటల్‌ వైపు అడుగులు వేస్తుండటం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో ఐటీ సేవలకు భారీగా గిరాకీ ఏర్పడుతోంది. ప్రధానమైన పలు ఐటీ కంపెనీల్లో వేలాది కొలువులు నిపుణులకోసం ఎదురు చూస్తున్నాయి. అంతేకాదు, ఆయా కంపెనీలు అర్హులైనవారికి పెద్దమొత్తంలో జీతాలను కూడా పెంచనున్నాయని తెలుస్తోంది.

నిపుణుల కొరత ఏర్పడిన విభాగాలు!
ఫుల్‌ స్టాక్‌ డెవలపర్స్‌, డేటా ఇంజినీర్స్‌, రియాక్ట్‌ నేటివ్‌ డెవలపర్స్‌, డెవలపర్‌ ఆప్స్/ సైట్‌ రిలయబిలిటీ ఇంజినీరింగ్‌, బ్యాక్‌ ఎండ్‌ ఇంజినీర్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ సేవల్లో  కొత్త ఉద్యోగాలకు భారీగా  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా రంగాల్లో పనిచేస్తున్నవారికి గత ఏడాదికంటే జీతాలు కూడా సుమారు 25 శాతం వరకు పెరిగాయి. అలాగే గత కొన్ని నెలలుగా ఉద్యోగావకాశాలు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పడు ప్రపంచంలో దాదాపు అన్ని వాణిజ్య సముదాయాలు డిజిటల్‌ వైపునకు అడుగులు వేస్తుండటం గమనార్హం. అందుకే ఐటీలో మళ్లీ బూమ్‌ కనిపిస్తోంది. 

‘‘ఆర్థికంగా మళ్లీ కోలుకోవాలంటే టెక్నాలజీతోనే సాధ్యం. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి ప్రబలడం వల్ల పరిశ్రమలన్నీ ఉన్నపళంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టాయి.  పనిచేసే పద్ధతులు కూడా చాలా వేగంగా మార్పుకు గురవుతున్నాయి’’ అని  విప్రో ఛైర్మన్‌, రిషాద్‌ ప్రేమ్‌జీ తెలియజేశారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఎక్స్‌ ఫీనో అనే ఐటీ ఉద్యోగుల నియామకం చేపట్టే సంస్థ ప్రకారం దేశంలో దాదాపు 70 వేలమంది ఐటీ నిపుణుల అవసరం ఉంది. పైగా యాభై శాతం జీతం కూడా అదనంగా ఇచ్చి నియామకాలు చేపట్టేందుకు పలు ఐటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్‌ ఐటీ సంస్థల్లో ఒకటైన యాక్సెంచర్‌లో గత ఏడాది 3వేల ఐటీ నిపుణుల అవసరం ఏర్పడింది. అయితే గత ఏప్రిల్‌కి ఆ సంఖ్య18 వేలకు పెరిగింది. ఇప్పుడు దాదాపు 30 వేలమంది అవసరం ఏర్పడింది. 

ప్రతిభావంతులకోసం యుద్ధమే!
సలీల్‌ పరేఖ్‌, ఇన్ఫోసిస్‌ సీఈఓ, గత ఫిబ్రవరిలో ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘‘ఇక ఐటీలో ప్రతిభావంతులకోసం యుద్ధం మొదలవుతుంది’’ అన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ కంపెనీ తమవద్ద నిపుణుల కొరత ఏర్పడటంతో కొన్ని ప్రాజెక్టులను కోల్పోవాల్సి వచ్చిందని తెలియజేసింది. ఇప్పటికే దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. ఇదిలావుంటే హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎఫ్‌ వై 21లాంటి కంపెనీలు కొత్తవారిని నియమించుకుంటున్నాయి. ఇక టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రోలు తమ ఉద్యోగులకు రెండో విడత  జీతాలను పెంచుతామని ఇదివరకే ప్రకటించాయి. ఉద్యోగులు వేరే కంపెనీకి మారకుండా అడ్డుకునేందుకు జీతాలు పెంచక తప్పడం లేదు. అలాగే  పెద్ద మొత్తంలో బోనస్‌లు కూడా ఇచ్చాయి. గత మార్చిలో కాగ్నిజంట్‌ బోనస్‌లు ఇవ్వడంతోపాటు, భారీగా పదోన్నతులను ప్రకటించింది. అలాగే ఐటీ కంపెనీలన్నీ ఒకవైపు కొత్తవారికి భారీగా అవకాశం ఇస్తూనే, మరోవైపు తమ వద్ద ఉన్న సిబ్బందికే మరింత శిక్షణనిచ్చి, వారిలోని నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని