Interest rate hike: రేట్ల పెంపు నిలుపుదల మా చేతుల్లో లేదు: ఆర్‌బీఐ గవర్నర్‌

చాలా మంది రేట్ల పెంపును (Interest rate hike) నిలిపివేయాలని తనకు సూచిస్తున్నారని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ తెలిపారు. అయితే, అది పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ గమనం, ద్రవ్యోల్బణం.. వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు.

Published : 24 May 2023 14:26 IST

దిల్లీ: వడ్డీరేట్ల పెంపు (Interest rate hike)ను నిలిపివేయడం అనేది తమ చేతుల్లో లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) అన్నారు. ఇది పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చాలా మంది రేట్ల పెంపును (Interest rate hike) నిలిపివేయాలని తనకు సూచిస్తున్నారని దాస్‌ తెలిపారు. అయితే, అది పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ గమనం, ద్రవ్యోల్బణం.. వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. తనకు తానుగా తీసుకునే నిర్ణయం కాదని తెలిపారు. మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail Inflation) కొంత తగ్గుముఖం పట్టిందని గుర్తుచేశారు. అయితే, ఇంతటితో సంతృప్తి చెందడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ నెలలో ద్రవ్యోల్బణం 4.7 శాతం దిగువకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ 4.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.

బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ..

భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరంగా, బలంగా ఉందని దాస్‌ ధీమా వ్యక్తం చేశారు. బలమైన మూలధన నిల్వలున్నాయన్నారు. ద్రవ్యలభ్యత కావాల్సిన స్థాయిలో ఉందన్నారు. ఆస్తుల నాణ్యత సైతం మెరుగవుతోందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

అంతరాయం లేకుండా నోట్ల మార్పిడి..

రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఆర్‌బీఐ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. నగదు నిర్వహణలో భాగంగా రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటి మార్పిడి ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. సెప్టెంబరు 30 వరకు అది కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని