SBI Amrit Kalash: ఎస్‌బీఐ ‘అమృత్‌ కలశ్‌’ గడువు పెంపు

SBI Amrit Kalash special deposit scheme: ఎస్‌బీఐ తన అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ గడువును పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకంపై 7.1శాతం వడ్డీ చెల్లిస్తుంది.

Published : 15 Apr 2023 20:14 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన పరిమితకాల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ (SBI Amrit Kalash) మరోసారి తీసుకొచ్చింది. 400 రోజుల కాలవ్యవధితో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి 2023 మార్చి 31తో ఈ స్కీమ్‌ గడువు ముగియగా.. తాజాగా ఈ స్కీమ్‌ను పునరుద్ధరించింది. ఈ పథకం జూన్‌ 30 వరకు అందుబాటులో ఉండనుంది. 

ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 12 నుంచి జూన్‌ 30 వరకు మాత్రమే ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది. ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.

స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్‌ కలశ్‌ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. అలాగే రుణ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐ 7 రోజుల నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3 నుంచి 7 శాతం వడ్డీరేటును ఎస్‌బీఐ చెల్లిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.50 శాతం అధికంగా ఇస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని