Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!

Stock market: దేశీయస్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22వేల స్థాయిని కోల్పోయింది.

Updated : 19 Mar 2024 13:03 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ నిర్ణయం వెలువడనుండటం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన సూచీలపై పడింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌లో అమ్మకాల వల్ల సూచీలు భారీగా పతనమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 21,900 స్థాయికి చేరింది. మధ్యాహ్నం 12.40 గంటలకు సెన్సెక్స్‌ 628 పాయింట్ల నష్టంతో 72,119 వద్ద, నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో 21,860 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ట్రేడువుతున్నాయి.

ఎందుకీ పతనం..?

  • వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారమే నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హాంకాంగ్‌, దక్షిణ కొరియా షేర్లు నష్టపోవడంతో ఆసియా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై పడింది.
  • బ్లాక్‌ డీల్‌ ద్వారా 2.02 కోట్ల టీసీఎస్‌ షేర్లను టాటా సన్స్‌ మంగళవారం విక్రయించనున్న నేపథ్యంలో టీసీఎస్‌ షేర్లు పతనమయ్యాయి. ఆ కంపెనీ షేరు 3 శాతం మేర క్షీణించింది. ఇతర ఐటీ కంపెనీలైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవుతుండడం సూచీలపై ప్రభావం చూపింది.
  • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడమూ మరో కారణం. సోమవారం రూ.2,061 కోట్ల విలువైన దేశీయ షేర్లను వారు విక్రయించినట్లు మార్కెట్‌ డేటా చెబుతోంది.
  • అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పెరగడమూ మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 86 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని