Samsung: శాంసంగ్‌ వారసుడికి కొరియా క్షమాభిక్ష..!

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్షను ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ (Samsung) వారసుడు లీ జే యాంగ్‌ (Lee Jae-yong)కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టనుంది. దీంతో

Updated : 12 Aug 2022 17:34 IST

సియోల్‌: లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్షను ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ (Samsung) వారసుడు లీ జే యాంగ్‌ (Lee Jae-yong)కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టనుంది. దీంతో మరో ఏడాది జైలు శిక్ష మిగిలి ఉండగానే జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించనుంది.

ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని జైల్లో ఉన్న వ్యాపార ప్రముఖులకు ఇలా కేసుల నుంచి విముక్తి కల్పించడం దక్షిణ కొరియాలో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. వచ్చే సోమవారం దక్షిణ కొరియా లిబరేషన్‌ డేను పురస్కరించుకుని దాదాపు 1700 మంది దోషులకు అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌ క్షమాభిక్ష పెట్టనున్నారు. ఇందులో జే యాంగ్‌తో పాటు మరో ప్రముఖ వ్యాపారవేత్త షిన్‌ డోంగ్‌ బిన్‌, తదితర పారిశ్రామికవేత్తల పేర్లు ఉన్నాయి. ఈ క్షమాభిక్షతో జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించడమే గాక, జైలు శిక్ష నేపథ్యంలో విధించిన ఉద్యోగపరమైన ఆంక్షలు కూడా తొలగిపోనున్నాయి. దీంతో ఆయన తిరిగి కంపెనీ బోర్డులోకి వచ్చి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

ఏంటీ కేసు నేపథ్యం..

54 ఏళ్ల లీ జే యాంగ్‌.. శాంసంగ్‌ గ్రూప్‌ అధినేత లీ కున్‌ హీ పెద్ద కుమారుడు. ప్రస్తుతం శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లంచం కేసులో 2017లో లీ జే యాంగ్‌ అరెస్టయ్యారు. శాంసంగ్‌‌కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు 2015లో అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. అనంతరం కేసును విచారించిన న్యాయస్థాం జే యాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణం బయటపడిన తర్వాత అప్పటి పార్క్‌ గ్వెన్‌ ప్రభుత్వం కూలిపోయింది.

అయితే తనకు విధించిన శిక్షపై జే యాంగ్‌ అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించగా.. 2018లో కోర్టు ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం దక్షిణ కొరియా సుప్రీంకోర్టును చేరగా.. లీ జే యాంగ్‌కు రెండున్నర ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఆయన.. గతేడాది ఆగస్టులో పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే ఈ కేసు రీత్యా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటివరకు కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతల నుంచి ఆయన దూరమయ్యారు. తాజాగా ఆయనకు క్షమాభిక్ష పెట్టడంతో త్వరలోనే తండ్రి వారసత్వాన్ని అందుకుని కంపెనీ పగ్గాలు చేపట్టే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని