చైనాకు ట్రంప్‌ చివరి ఝలక్‌!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాకు చివరి ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పదవిలో ఉన్నంత కాలం డ్రాగన్‌తో కయ్యానికి కాలుదువ్విన

Published : 18 Jan 2021 11:07 IST

వాషింగ్టన్ ‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాకు చివరి ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పదవిలో ఉన్నంత కాలం డ్రాగన్‌తో కయ్యానికి కాలుదువ్విన ఆయన చివరి రోజుల్లోనూ వదిలిపెట్టడం లేదు. ఆర్థికంగా చైనాను బలహీనపరిచేందుకు ఉన్న అన్ని అస్త్రాల్ని సంధిస్తున్నారు. తాజాగా చైనా టెలికాం దిగ్గజం, 5జీ సాంకేతికతకు ప్రసిద్ధి గాంచిన హువావే టెక్నాలజీస్‌పై విరుచుకుపడ్డారు.

అమెరికాలోని ఇంటెల్‌ సహా మరికొన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు హువావేకు పరికరాలను సరఫరా చేస్తున్నాయి. ఈ అనుమతుల్ని రద్దు చేసేందుకు ట్రంప్‌ సిద్ధమయ్యారు. ఎగుమతుల కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులను కూడా తిరస్కరించే యోచనలో ఉన్నారు. దాదాపు 150 అనుమతుల్ని ట్రంప్‌ రద్దు చేయనున్నట్లు సమాచారం. వీటి విలువ దాదాపు 120 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. మరో 280 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలకు చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్‌ తాజా నిర్ణయంతో అవన్నీ నిలిచిపోయే అవకాశం ఉంది. హువావేకు అమెరికా నుంచి ఎలాంటి పరికరాలు వెళ్లకూడదని ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు వాణిజ్య శాఖ నోటీసులు జారీ చేసింది. ట్రంప్‌ నిర్ణయంపై 20 రోజుల్లోగా స్పందించాలని తెలిపింది.

5జీ సాంతికేతికతను సమకూర్చే అంశంలో హువావే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ట్రంప్‌ మాత్రం దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వచ్చారు. చైనా సాంకేతికత వల్ల సమాచారం దోపిడీకి గురవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హువావేను బహిష్కరించాలని పాశ్చాత్య దేశాలను సైతం ఆయన కోరారు. దీంతో హువావేతో ఉన్న ఒప్పందాన్ని యుకే‌ రద్దు చేసుకుంది.

ఇవీ చదవండి...

పదవి చేపట్టిన తక్షణమే విధుల్లోకి

భారతీయ అమెరికన్లకు బైడెన్‌ పెద్దపీట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని