అంబులెన్స్‌కు అల్లరిమూకల నిప్పు

గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై అల్లరిమూక పాశవిక దాడికి పాల్పడింది. వాహనానికి నిప్పు పెట్టడంతో బాలుడితోపాటు అతడి తల్లి, బంధువు మరణించారు.

Updated : 08 Jun 2023 06:21 IST

మణిపుర్‌లో తల్లి, కుమారుడు, బంధువు మృతి
ఆలస్యంగా వెలుగులోకి

ఇంఫాల్‌: గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై అల్లరిమూక పాశవిక దాడికి పాల్పడింది. వాహనానికి నిప్పు పెట్టడంతో బాలుడితోపాటు అతడి తల్లి, బంధువు మరణించారు.మణిపుర్‌లో ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా  వెలుగు చూసింది. మణిపూర్‌లోని కాన్‌చుప్‌కు చెందిన మీనా హాంసింగ్‌ (45), ఆమె కుమారుడు టోన్సింగ్‌ (8), వారి బంధువు లిడియా (37) కాన్‌చుప్‌లోని అస్సాం రైఫిల్స్‌ రిలీఫ్‌ క్యాంపులో ఉంటున్నారు. టోన్సింగ్‌ తల్లి మేతీ వర్గానికి చెందిన మహిళ. తండ్రి కుకీ వర్గానికి చెందిన వ్యక్తి. వీరిది ప్రేమ వివాహం. టోన్సింగ్‌కు అమ్మా నాన్నే లోకం. రోజూ తోటి పిల్లలతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకోవడం, ఆడుకోవడమే దినచర్య. నెల కిందటి వరకు సజావుగా సాగిన ఆ బాలుడి జీవితం రాష్ట్రంలో చెలరేగిన హింసతో ఒక్కసారిగా తలకిందులైంది. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో హింస చెలరేగడంతో పునరావాస కేంద్రానికి చేరుకున్నారు.  ఎప్పటిలానే టోన్సింగ్‌ ఆదివారం (4వ తేదీ) సాయంత్రం పునరావాస కేంద్రంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అంతలోనే తుపాకీ పేలిన శబ్దం.. అక్కడి నుంచి పరిగెత్తేలోపే టోన్సింగ్‌ తలను ఏదో వేగంగా తాకుతూ వెళ్లడంతో పడిపోయాడు.

ఒక్కసారిగా తల నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ శబ్దానికి అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అప్పటికే అక్కడకు చేరుకున్న టోన్సింగ్‌ తల్లి, కుమారుడిని ఆ పరిస్థితిలో చూసి తల్లడిల్లింది. దీంతో సీనియర్‌ అధికారి ఒకరు వెంటనే పోలీసులతో మాట్లాడి ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. కొంత దూరం కాపలాగా వచ్చిన అస్సాం రైఫిల్స్‌ జవాన్లు ఆ తర్వాత భద్రత బాధ్యతను మణిపుర్‌ పోలీసులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అంబులెన్స్‌ ఇరోసెంబా వద్ద వెళ్తుండగా అల్లరిమూక అడ్డుకుని నిప్పంటించింది. దీంతో అందులోని ముగ్గురూ సజీవ దహనమయ్యారు. అంబులెన్స్‌ సిబ్బంది గాయాలతో బయటపడ్డారు. కాన్‌చుప్‌ ప్రాంతంలో కుకీలు అధికంగా ఉంటారు. పక్కనే ఉన్న ఫయెంగ్‌లో మేతీ వర్గంవారు ఎక్కువగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని