Crime news: అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని.. కుమారుడికి విషమిచ్చి చంపేశాడు!

ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడన్న కారణంతో ఓ తండ్రి కన్న కుమారుడికే విషమిచ్చి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్‌లో జరిగింది.

Published : 01 Feb 2024 22:28 IST

సోలాపుర్‌: మొబైల్‌లో అశ్లీల చిత్రాలు (Blue flims) చూస్తున్నాడని తన 14 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి చంపేశాడో తండ్రి. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికి కాల్వలో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) సోలాపుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు విజయ్‌ బట్టు.. టైలర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కొడుకు విశాల్‌ దగ్గర్లోని పాఠశాలలో చదువుతున్నాడు. రోజూ స్కూల్‌కు ఫోన్‌ తీసుకెళ్లి అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. దీనిపై ఉపాధ్యాయులు కూడా పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు. దీంతో విసుగెత్తిపోయి.. ఆహారంలో విషం కలిపి చంపేశాడు. 

ఈ సంగతి అతడి భార్యకు కూడా తెలియదు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 13న దంపతులిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టగా.. ఇంటికి దగ్గర్లోని ఓ మురికి కాల్వలో మృతదేహం లభ్యమైంది. తమకు లభించిన ఆధారాలకు, మృతుడి తండ్రి చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎలాగైనా దొరికిపోతానని గ్రహించిన విజయ్‌.. తొలుత జరిగిన విషయాన్ని జనవరి 28న తన భార్యకు చెప్పేశాడు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి రెండు రోజుల కస్టడీకి అనుమతించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని