TS News: ఆ డబ్బు సమకూర్చేదెవరు? రామచంద్రభారతికి సిట్‌ ప్రశ్నల వర్షం

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ విచారణ రెండో రోజు కొనసాగింది. ఎమ్మెల్యేలతో ఫామ్‌హౌస్‌లో బేరసారాలపై నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నించినప్పుడు చాలా వరకు తమకు తెలియదనే సమాధానం వచ్చినట్టు తెలిసింది.

Updated : 11 Nov 2022 19:15 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ విచారణ రెండో రోజు కొనసాగింది. నిన్న రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో ముగ్గురు నిందితులను ప్రశ్నించిన సిట్‌ అధికారులు ఇవాళ కూడా అక్కడే ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి స్వర నమూనాలు సేకరించిన అధికారులు భిన్న కోణాల్లో వారిని విచారించారు. ఈ వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి వాంగ్మూలం కీలకం కానుందని సిట్‌ భావిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడటం, పైలట్‌ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో.. ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యమేర్పడింది.

ఇదే అంశంపై సిట్‌ ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలతో ఫామ్‌హౌస్‌లో బేరసారాలపై నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నించినప్పుడు చాలా వరకు తమకు తెలియదనే సమాధానం వచ్చినట్టు తెలిసింది. నిందితులను విచారిస్తున్న రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. విచారణ జరుగుతున్న తీరును పరిశీలించారు. రెండ్రోజుల సిట్‌ విచారణ ముగిసిన తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఈనెల 25 వరకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో వైపు ముగ్గురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని