logo

అమాయకత్వమే ఆసరాగా మోసాలు

నగరంలోని శ్రీనివాస్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యాన్సీ దుకాణం పేరిట వ్యాపారి కార్తీక్‌ కుమార్‌.. తనకు  తెలిసిన వారి క్రెడిట్‌ కార్డులను సొంతానికి  ఉపయోగించుకుని రూ.3 కోట్ల వరకు మోసం చేశాడు.

Published : 04 Dec 2022 03:37 IST

 ఉద్యోగాల పేరుతో దగా..
 వెలుగులోకి  మరో కుంభకోణం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే

నగరంలోని శ్రీనివాస్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యాన్సీ దుకాణం పేరిట వ్యాపారి కార్తీక్‌ కుమార్‌.. తనకు  తెలిసిన వారి క్రెడిట్‌ కార్డులను సొంతానికి  ఉపయోగించుకుని రూ.3 కోట్ల వరకు మోసం చేశాడు.

మనీ సర్క్యులేషన్‌ పేరుతో అమాయకుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన సంకల్ప సిద్ధి సంస్థ బోర్డు తిప్పేసింది.

తాజాగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన మరో సంస్థ నిర్వాకం వెలుగుచూసింది.

నిరుద్యోగుల అమాయకత్వం ఆసరాగా చేసుకుని, వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి నిలువునా ముంచేస్తున్నాయి పలు సంస్థలు. ఒకదాని తర్వాత మరొకటి వెలుగు చూస్తుండటంతో.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియన జనం గందరగోళానికి గురవుతున్నారు. ఇదిగో ఉద్యోగం వచ్చేసిందంటూ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు చేతిలో పెట్టి, ఉద్యోగాలు ఇచ్చేసినట్లు నటిస్తున్నారు. జీతం వద్దకు వచ్చేసరికి చేతులు ఎత్తేస్తుండటంతో మోసపోయినట్లు ఉద్యోగార్థులు గుర్తిస్తున్నారు. అప్పటికే ఆయా సంస్థలు రూ.కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేస్తున్నాయి. తాజాగా సూర్యారావుపేటలో ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే అధికారుల ఉద్యోగాలు ఉన్నాయంటూ ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు వసూలు చేసిన ‘ఆల్ఫా బెట్‌ వెంచర్‌’ అనే సంస్థ గుట్టు రట్టయింది. దీనిపై సూర్యారావుపేట పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి..

సూర్యారావుపేట వేమూరి వారి వీధిలో ఆల్ఫా బెట్‌ వెంచర్‌ అనే సంస్థ ఉంది. ఉద్యోగావకాశాలున్న విభాగాల్లో శిక్షణ ఇస్తామని ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను తమ సంస్థ ద్వారానే నిర్వహిస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే సూపర్‌వైజర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్లను నియమిస్తున్నామంటూ చెప్పారు. దీన్ని నమ్మి కొంత మంది రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు చెల్లించారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.40వేల వరకు జీతం వస్తుందని చెప్పటంతో.. చాలా మంది ఆకర్షితులయ్యారు. శిక్షణ పూర్తి చేసినా ఉద్యోగాలు ఇవ్వకుండా సదరు సంస్థ ముఖం చాటేయటంతో.. డబ్బులు కట్టిన వారు ఆందోళన బాట పట్టారు.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

ఆల్ఫా బెట్‌ వెంచర్‌ సమాచారం బయటకు రాగానే సూర్యారావుపేట పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం వేమూరి వారివీధిలోని సంస్థ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరు మాత్రమే ఉండటంతో.. వివరాలు సేకరించారు. సంస్థకు సంబంధించిన సమాచారంతో పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. రాష్ట్రపతి నగర పర్యటన ఉండటంతో పోలీసు అధికారులంతా బందోబస్తులో ఉండటంతో.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై విచారణ జరుపుతామని అధికారులు అంటున్నారు. ఎవరైనా డబ్బులు కట్టి మోసపోయి ఉంటే తమకు సమాచారం అందించాలని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని